వార్ నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 05-03-2026 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Stock Market మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల భయాలతో నిన్న సెషన్లో సూచీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
ఉదయం ట్రేడింగ్లో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ మెటల్ 1.23 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 1.43 శాతం మేర లాభపడి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 1 శాతానికి పైగా లాభాలతో రాణిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావంతో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ గత సెషన్లో 92.18కి పడిపోయినా, ప్రస్తుతం 91.66 వద్ద స్థిరపడింది. మరోవైపు అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచింది.
టెక్నికల్గా నిఫ్టీకి 24,600-24,650 స్థాయిల వద్ద నిరోధం, 24,300-24,350 వద్ద మద్దతు ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక, మార్చి 4న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) రూ. 8,752 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) రూ. 12,068 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.