Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతంలో భారీ పెరుగుదల!
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ద్వారా మైక్రోసాఫ్ట్, S&P 500 ఇండెక్స్ను రాబడి (రిటర్న్) పరంగా అధిగమించింది.
- Author : Gopichand
Date : 22-10-2025 - 1:28 IST
Published By : Hashtagu Telugu Desk
Satya Nadella: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) వార్షిక వేతనం భారీగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2025లో ఆయన జీతంలో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. కంపెనీ షేర్ల అద్భుత పనితీరు కారణంగానే నాదెళ్లకు ఈ బంపర్ ఆఫర్ దక్కింది. కంపెనీ దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో నాదెళ్ల మొత్తం పరిహారం (Total Compensation) 96.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8415 కోట్లు)కి పెరిగింది. ఇది గత ఏడాది కంటే గణనీయంగా ఎక్కువ. అంతకుముందు 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం వేతనం రూ. 4220 కోట్ల నుంచి రూ. 6880 కోట్లకు పెరిగింది.
రూ. 7310 కోట్లు షేర్ల రూపంలో
నాదెళ్ల ఈ ఏడాది వేతన ప్యాకేజీలో అత్యధిక భాగం అంటే దాదాపు రూ. 7310 కోట్లు (84 మిలియన్ డాలర్లు), కంపెనీ షేర్ల రూపంలో లభించింది. కేవలం రూ. 826 కోట్లు (9.5 మిలియన్ డాలర్లు) మాత్రమే నగదు బోనస్గా ఆయనకు అందాయి. ఇది ఆయన జీతంలో 90 శాతం వరకు షేర్ల రూపంలోనే ఉండటం గమనార్హం. ఈ భారీ వేతన పెరుగుదల పూర్తిగా మైక్రోసాఫ్ట్ షేర్ల అద్భుత పనితీరుతో ముడిపడి ఉంది. కంపెనీ షేర్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తుండటంతో నాదెళ్ల ఈ ప్రయోజనాన్ని ఎక్కువగా పొందుతున్నారు.
Also Read: Modi Thanks to Trump : ట్రంప్ కు మోడీ థాంక్స్..ఎందుకంటే !!
ఇతర ఉన్నతాధికారుల జీతాలు సైతం
నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్లోని ఇతర ముఖ్య అధికారుల వేతనాలు కూడా పెరిగాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ (Amy Hood)కు రూ. 2566 కోట్లు (29.5 మిలియన్ డాలర్లు) లభించగా, కొత్త కమర్షియల్ హెడ్ జడ్సన్ ఆల్థాఫ్ (Judson Althoff)కు రూ. 2453 కోట్లు (28.2 మిలియన్ డాలర్లు) ప్యాకేజీ లభించింది.
2025 సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ షేర్లలో 23 శాతం భారీ పెరుగుదల నమోదైంది. ఈ వృద్ధి ద్వారా మైక్రోసాఫ్ట్, S&P 500 ఇండెక్స్ను రాబడి (రిటర్న్) పరంగా అధిగమించింది. ఎందుకంటే ఆ ఇండెక్స్ కేవలం 15 శాతం రాబడిని మాత్రమే అందించింది. గత మూడు సంవత్సరాలలో కంపెనీ షేర్ల విలువ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఈ అద్భుతమైన వృద్ధి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ ఆక్రమణత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహం సత్ఫలితాలను ఇస్తోందని నిరూపిస్తోంది.