Digital Payments: రేపటి నుండి UPI చెల్లింపుల్లో పెను మార్పు!
ఈ కొత్త ఫీచర్ అమలులోకి రావడంతో మొబైల్ ఫోన్లో పిన్ నమోదు చేసే అవసరం లేకుండానే చెల్లింపులు పూర్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. సురక్షితమైన ఆధార్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ జరగడం వల్ల డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.
- By Gopichand Published Date - 08:44 PM, Tue - 7 October 25

Digital Payments: భారతదేశ డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల అనుభవాన్ని మరింత సులభతరం, సురక్షితం చేయడానికి రేపటి (అక్టోబర్ 8) నుంచి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇకపై కేవలం తమ ముఖ గుర్తింపు (Face Recognition) లేదా వేలిముద్రల (Fingerprints)ను ఉపయోగించి UPI చెల్లింపులను పూర్తి చేయవచ్చు.
భద్రత, వేగం రెండూ
ప్రస్తుతం చెల్లింపుల ఆమోదం కోసం తప్పనిసరిగా సంఖ్యా పిన్ (Numeric PIN) అవసరమయ్యే విధానానికి ఈ కొత్త మార్పు తెరదించనుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా పిన్ గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు పడే వారికి అలాగే వేగంగా చెల్లింపులు చేయాలనుకునే వారికి ఈ బయోమెట్రిక్ విధానం ఎంతో ఉపశమనం ఇవ్వనుంది. ఈ కొత్త బయోమెట్రిక్ వ్యవస్థ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్లో ఉన్న బయోమెట్రిక్ డేటాను ఉపయోగించుకోనున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఆథెంటికేషన్ ప్రక్రియ అత్యంత సురక్షితంగా, నమ్మకమైనదిగా మారుతుంది.
Also Read: Rohit Sharma: రంజీ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మ.. అసలు విషయం ఏంటంటే?
ఆర్బీఐ మార్గదర్శకాలతో బలం
ఆథెంటికేషన్కు ప్రత్యామ్నాయ, మరింత అధునాతన పద్ధతులను అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చారిత్రక నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకుంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో NPCI ఈ వినూత్న బయోమెట్రిక్ ఫీచర్ను అధికారికంగా ప్రదర్శించడానికి కూడా సన్నాహాలు చేస్తోంది.
డిజిటల్ భారత్కు మరింత బలం
ఈ కొత్త ఫీచర్ అమలులోకి రావడంతో మొబైల్ ఫోన్లో పిన్ నమోదు చేసే అవసరం లేకుండానే చెల్లింపులు పూర్తి చేసే వెసులుబాటు కలుగుతుంది. సురక్షితమైన ఆధార్ డేటా ఆధారంగా ఈ ప్రక్రియ జరగడం వల్ల డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల స్వీకరణను మరింత వేగవంతం చేయడానికి, సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలకు మరింత చేరువ చేయడానికి ఈ కొత్త UPI ఫీచర్ బలమైన అడుగు వేయనుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కోట్ల మంది యూపీఐ వినియోగదారులు ఈ సులభమైన, వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపుల విప్లవాన్ని అనుభవించనున్నారు.