NUDGE 2.0 : వేల కోట్లు దాచేవారిపై ఐటీ శాఖ నిఘా.. డబుల్ టాక్స్!
- By Vamsi Chowdary Korata Published Date - 11:22 AM, Mon - 1 December 25
టాక్స్ పేయర్లు.. విదేశీ ఆస్తులు, విదేశీ వనరుల నుంచి ఆదాయాన్ని సరిగ్గా రిపోర్ట్ చేయడానికి ఆదాయపు పన్ను విభాగం మరోసారి క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని కింద నవంబర్ 28 నుంచే టాక్స్ పేయర్లకు నోటీసులు పంపిస్తోంది. ఇక్కడ రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
భారతదేశంలో ఎవరైనా నిర్దిష్ట ఆదాయానికి మించి ఆర్జిస్తున్నట్లయితే.. అప్పుడు ఆదాయపు పన్ను వ్యవస్థల్లోని పన్ను విధానాల్ని బట్టి టాక్స్ శ్లాబుల ఆధారంగా టాక్స్ చెల్లించాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాత, కొత్త ఆదాయ పన్ను విధానాలు ఉన్నాయి. అయితే.. చాలా మంది తాము చెల్లించాల్సిన టాక్స్ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు మార్గాల్ని అవలంబించడం చేస్తున్నారు. ఇక్కడ ఇది ఎన్నో రకాలుగా ఉంటుంది. ప్రధానంగా తప్పుడు మినహాయింపుల్ని క్లెయిమ్ చేయడం, అన్ని రకాల ఆదాయాల్ని పేర్కొనకపోవడం చేస్తుంటారు. అయితే ఇటీవల ఐటీ శాఖ దీనిపై మరింత దృష్టి సారిస్తోంది. కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతూ.. ప్రధానంగా డేటా అనలిటిక్స్ ద్వారా ఇలా పన్ను ఎగవేతకు పాల్పడేవారిని గుర్తిస్తోంది. ఇలాంటి వారి కోసం.. ముఖ్యంగా పన్ను చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు.. తమంతట తాము ముందుకు వచ్చేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు .. ఒక క్యాంపెయిన్ లాంఛ్ చేసింది. ఇదే NUDGE.
ముఖ్యంగా ఇక్కడ విదేశాల్లోని భారతీయ నివాసితుల ఆస్తులు, ఇతర ఆదాయ వనరులు, ఆ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని.. చాలా మంది ఐటీ రిటర్న్స్ల్లో రిపోర్ట్ చేయకుండా టాక్స్ నుంచి తప్పించుకుంటున్నారు. ఇందుకోసమే NUDGE 2.O. క్యాంపెయిన్ ప్రారంభించింది. వారంతటే వారే వచ్చి.. తమ ఆదాయాన్ని నివేదించడం దీని ముఖ్య ఉద్దేశం. గతేడాది తొలిసారి క్యాంపెయిన్లో భాగంగా.. 2024, నవంబర్ 17న లాంఛ్ చేయగా సుమారు 24,678 మంది టాక్స్ పేయర్లు.. రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేసి తమ ఆదాయాన్ని నివేదించారు. వీరికి ఏకంగా రూ. 29,208 కోట్లు విదేశాల్లో ఆస్తులు ఉండగా.. విదేశీ వనరుల ఆదాయం రూ. 1089.88 కోట్లుగా ఉంది.
భారతీయ ఆదాయపు పన్ను చట్టం కింద.. వెల్లడించని విదేశీ ఆదాయం , ఆస్తుల విషయంలో బ్లాక్ మనీ యాక్ట్ వర్తిస్తుంది. ఇక్కడ విదేశీ ఆదాయం ఐటీ రిటర్న్స్ల్లో నివేదించకపోతే అప్పుడు రూ. 10 లక్షల జరిమానా అదనంగా చెల్లించాల్సిన టాక్స్పై 120 శాతం వరకు పెనాల్టీ పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఈ సమస్య తీవ్రంగా ఉంటే.. చట్టపరమైన చర్యలు అంటే జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఈసారి కూడా వేలల్లో ఇలా ఆదాయం దాచేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో.. 2.O. క్యాంపెయిన్ లాంఛ్ చేసింది. నవంబర్ 28 నుంచే దీని కింద ఎస్ఎంఎస్, ఇమెయిల్స్లో నోటీసులు పంపిస్తోంది. వారు.. ఒకసారి సమీక్షించుకొని.. తమ ఆదాయం, ఆస్తుల వివరాల్ని వెల్లడించేందుకు రివైజ్డ్ రిటర్న్స్ రూపంలో అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా ఇతర జరిమానాలు, చట్టపర చర్యల నుంచి తప్పించుకోవచ్చు.