Mukesh Ambani : ఆల్ టైమ్ గరిష్టాలకు అంబానీ రిలయన్స్ షేరు..!
- By Vamsi Chowdary Korata Published Date - 01:57 PM, Tue - 25 November 25
భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది.
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు.. కాసుల పంట పండిస్తోంది. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న ఈ షేరు.. ఇవాళ (మంగళవారం సెషన్) మళ్లీ పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకింది. కిందటి సెషన్లో రూ. 1535.90 వద్ద ముగిసిన రిలయన్స్ షేరు.. ఇవాళ అదే స్థాయిలో ఓపెన్ అయింది. తర్వాత స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో ప్రారంభమైన క్రమంలో రిలయన్స్ స్టాక్ కూడా దాదాపు 2 శాతం లాభంతో ఇంట్రాడేలో రూ. 1559.60 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇదే ఇప్పటివరకు ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర. అంటే ఏడాది వ్యవధిలో ఇదే అత్యధిక ధర అన్న మాట. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 1.30 గంటలకు) చూస్తే స్టాక్ ఒక శాతం లాభంతో రూ. 1550 వద్ద ట్రేడవుతోంది.
కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సరిగ్గా రూ. 21 లక్షల కోట్ల వద్ద ఉంది. మార్కెట్ విలువ పరంగా దేశంలో ఇదే అతిపెద్ద కంపెనీగా చెప్పొచ్చు. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 1559.60 గా ఉండగా.. కనిష్ట ధర రూ. 1114.85 గా ఉంది. అంటే ఇక్కడ జీవన కాల కనిష్ట స్థాయిల నుంచి ఈ స్టాక్ ధర సుమారు 40 శాతం వరకు పెరిగింది. దీంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలే వచ్చాయని చెప్పొచ్చు.
గత కొద్ది రోజులుగా రిలయన్స్ షేర్ ధర స్థిరంగా రాణిస్తూ వస్తుండటం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్ రాణిస్తుండటం సహా అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు నెలకొనడం దీనికి కారణంగా చెప్పొచ్చు. గత 5 రోజుల్లో చూస్తే రిలయన్స్ షేరు 2 శాతానికిపైగా పెరగ్గా.. నెల వ్యవధిలో 5 శాతం వరకు పెరిగింది. 6 నెలల్లో 8 శాతం పుంజుకోగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే ఏకంగా 27 శాతం ఎగబాకింది. ఐదేళ్లలో 60 శాతానికిపైగా పెరిగింది. ఇలా ఇంత పెద్ద స్టాక్.. స్థిరంగా రిటర్న్స్ అందించింది.
తాజా ర్యాలీకి కారణం చూస్తే.. ప్రముఖ బ్రోకరేజీ జేపీ మోర్గాన్ రిలయన్స్ స్టాక్ను ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇంకా రాణించే అవకాశం ఉందని వేసింది. టార్గెట్ ప్రైస్ ప్రస్తుత ధర నుంచి 11 శాతం కంటే ఎక్కువగా రూ. 1727 గా అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ షేర్లు కొనుగోలు చేేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల క్యూ2 ఫలితాల్లోనూ సంస్థ నికర లాభం 9.6 శాతం పెరిగింది. ఇది కూడా స్టాక్ ర్యాలీకి దారితీస్తోంది.