YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం
‘‘వివేకా(YS Viveka Murder Case) హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు’’
- By Pasha Published Date - 02:39 PM, Tue - 15 April 25

YS Viveka Murder Case: ఆరేళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన నిందితుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు. ఉదయ్ బెయిల్ను రద్దు చేయాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం దీనిపై ఇవాళ విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్ పాత్ర ఏమిటని సీజేఐ సంజీవ్ ఖన్నా ఈసందర్భంగా ప్రశ్నించారు.
Also Read :Minister Ponguleti : ‘‘ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తారా ? తండ్రీకొడుకులది అధికార దాహం’’
గాయాలు కనపడకుండా కట్లు కట్టి..
‘‘వివేకా(YS Viveka Murder Case) హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరు’’ అని సునీత తరఫు న్యాయవాదులు సీజేఐకు వివరించారు. దీంతో సుప్రీంకోర్టు బెంచ్.. ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్లతో ఈ పిటిషన్ను కూడా జతచేయాలని సీజేఐ సూచించారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ గతంలో అరెస్టు చేసింది. అయితే ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
Also Read :Salman Khan : సల్మాన్ఖాన్కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి దొరికాడు.. అయితే !!
2019లో అనుమానాస్పద స్థితిలో మర్డర్
2019 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. గుండెపోటుతో ఆయన చనిపోయారని తొలుత అందరూ భావించారు అయితే పోస్ట్ మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. గొడ్డలిపోట్ల వల్లే వివేకా చనిపోయారని వెల్లడైంది. వివేకా శరీరంపై ఏడు చోట్ల గొడ్డలి గాయాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ.. అప్పట్లో కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ కూడా వేశారు. ఈనేపథ్యంలో ఆనాడు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిచింది.