Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
- Author : Latha Suma
Date : 04-04-2025 - 12:06 IST
Published By : Hashtagu Telugu Desk
Minister Lokesh : ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేశ్ అందజేశారు. అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Read Also: Gold Price : భారీగా తగ్గిన బంగారం
నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశాం అని మంత్రి లోకేశ్ వివరించారు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా. సూపర్ సిక్స్ హామీలతో పాటు మంగళగిరికి నేను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నాను. ఏప్రిల్ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తాం. సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం అన్నారు.
ఇక, మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇచ్చిన ఏ మాటనూ, చేసిన ఏ వాగ్దానాన్నీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టబడటం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదనిపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. విపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి జై అన్న జగన్ అధికార పగ్గాలు అందుకోగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. అమ్మ ఒడి, పింఛన్లు ఇలా ఒకటనేమిటి.. తన పాదయాత్ర సందర్భంగా గల్లీకో వాగ్దానం చొప్పున చేసిన జగన్ వాటిని నెరవేర్చాలన్న విషయాన్నే పూర్తిగా మరిచారు. అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగా ఆయన పాలన సాగిందని మంత్రి లోకేశ్ అన్నారు.