TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం
TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
- By Kavya Krishna Published Date - 10:38 AM, Sun - 1 June 25

TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధమని, ఇది అపవిత్రంగా భావిస్తున్నామని భక్తులు, పీఠాధిపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీన, పవిత్ర దేవాలయాలలో ఒకటి. అనాదిగా వస్తున్న సంప్రదాయాల ప్రకారం, ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు, ముఖ్యంగా విమాన ప్రయాణాలు సాగకూడదని ఆగమశాస్త్ర నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ తరుచూ విమానాలు ఆలయ ప్రాంగణంపై నుంచి ఎగురుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇది కేవలం సాంప్రదాయాల ఉల్లంఘన మాత్రమే కాదు, ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్షలాది మంది భక్తులకు భద్రతా పరమైన ఆందోళనలను కూడా కలిగిస్తుంది. ఒకవేళ విమానం ఏదైనా సాంకేతిక సమస్యతో కూలితే, ఊహించని నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ సమస్యపై అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుమలను నో-ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉంది. భక్తుల మనోభావాలు, ఆగమశాస్త్ర నియమాలు, భద్రతా ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. టీటీడీ చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల భక్తులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, తిరుమల వంటి ప్రముఖ క్షేత్రం విషయంలో నిర్లక్ష్యం వహించడం విమర్శలకు తావిస్తోంది.
ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం అనేది తమ భక్తి భావనలను, పవిత్రతను అవమానించడమేనని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భక్తుల్లో దైవత్వం పట్ల ఉన్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆధ్యాత్మిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను గుర్తించి, తిరుమలను నో-ఫ్లై జోన్గా ప్రకటించి, భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, భక్తుల నుంచి మరింత పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
Pension Increase : ఏపీలో మరోసారి పింఛన్ల పెంపు జరగబోతుందా..?