Tirupati Laddu Case: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
- By Praveen Aluthuru Published Date - 08:04 AM, Mon - 30 September 24

Tirupati Laddu Case: తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేశారంటూ దాఖలైన పలు పిల్లను సుప్రీంకోర్టు ఈ రోజు సోమవారం విచారించనుంది. సుప్రీం కోర్టు వెబ్సైట్లో ప్రచురించిన దాని ప్రకారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 30న అంటే ఈ రోజు ఈ కేసును విచారించనుంది.
సీబీఐ విచారణకు డిమాండ్:
ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ట్రస్టు నేరపూరిత కుట్ర, దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరిపించాలని లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని న్యాయవాది సత్యం సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో కోరారు.
పిటిషనర్ ఏం చెప్పారు?
తిరుమలలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర మాంసాహార పదార్థాలను వాడినట్లు విచారణలో తేలిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విధంగా జరగడం హిందూ మత ఆచారాలను తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. తిరుమల తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రసాదంలో జంతువుల కొవ్వును కల్తీ చేయడం రాజ్యాంగంలోని 25వ అధికరణాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని, ఇది మతస్వేచ్ఛకు సంబంధించిన హక్కు అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ను ఏర్పాటు చేశారు.
తిరుపతి లడ్డుపై రాజకీయాలు:
మరోవైపు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోసిపుచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం నియమించిన టీటీడీ కార్యనిర్వహణాధికారి ప్రకటనలు సీఎం వాదనలను ఖండిస్తున్నామంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పేర్కొన్నారు.
సీజేఐ తిరుపతి ఆలయ సందర్శన:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పూజలు చేశారు. సీజేఐ తన బంధువులతో కలిసి గర్భగుడిలో పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో సీజేఐ, ఆయన బంధువులు ఆలయ అర్చకుల నుంచి వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను సీజేఐకి అందజేశారు.
Also Read: J&K Assembly elections: మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర