Jagan Cabinet: ఆ నలుగురు మంత్రులు సేఫ్..?
- By HashtagU Desk Published Date - 12:34 PM, Sat - 19 March 22
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కొత్త మంత్రివర్గ మార్పుపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచర మంత్రులకు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత మంత్రుల్లో 90 శాతం మంది పైగా తమ పదవులు వదులుకోవాల్సి వస్తుందని జగన్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ చెప్పిన మాటలతో కొత్త మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మంత్రులకు మాత్రమే మరోసారి మంత్రి వర్గంలో చోటు దక్కనుందని వైసీపీ వర్గాల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియదు కానీ, నలుగురు మంత్రులు మాత్రం సేఫ్ అంటూ పుకార్లు జోరుగా షికార్లు చేస్తున్నాయి. ఆ నులుగురిలో మొదట ఇద్దరు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మంత్రులు ప్రస్తుతం మంత్రివర్గంలో కీలక స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
కొడాలి నాని అయితే ప్రత్యర్థులపై ఏ రేంజ్లో విరుచుకుపడతారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలను కొడాలి నాని ఓ రేంజ్లో ఉతికి ఆరేస్తాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చేసే వ్యాఖ్యలపై కొడాలి నాని రియక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ మంత్రిగా పేరొందిన కొడాలి నానిని మరోసారి మంత్రిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా కొడాలి నాని కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో, ఆయన్ను సీఎం జగన్ మంత్రి వర్గంలో కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక పేర్ని నాని విషయానికి వస్తే.. కాపుసామాజిక వర్గం నేతగా ఉన్న పేర్నినాని ప్రస్తుతం జగన్ కేబినెట్లో సినిమటోగ్రఫీ శాఖలో మంత్రిగా ఉన్నారు. పేర్ని నాని ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి సిట్యువేషన్లో అయినా ప్రాబ్లమ్ని రచ్చ చేయకుండా కూల్గా సాల్వ్ చేస్తారు. ముఖ్యంగా ఇటీవల ఏపీ సినిమా టెకెట్స్ వివాదాన్ని పేర్నినాని తనదైన స్టైల్లో హ్యాండిల్ చేశారని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ను ఓ రేంజ్లో ఆడుకునే పేర్నినాని, మరోవైపు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
దీంతో పేర్ని నానిని మంత్రివర్గంలో కొనసాగిస్తే.. కాపు సామాజికవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో పేర్నినాని దాదాపు మంత్రి వర్గంలో కొనసాగడం ఖాయమని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సేఫ్ లిస్ట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉందని తెలుస్తోంది. సీఎం జగన్కు అత్యంత ఆప్తులుగా ఉన్న పెద్దిరెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగరేయడంలో పెద్దిరెడ్డి కీకలంగా వ్యవహరించారు. దీంతో మరోసారి మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇకపోతే సేఫ్జోన్లో ఉన్న మంత్రుల్లో బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఉన్న బొత్స సత్యనారాయణ ప్రస్తుతం మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యానారాయణ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి తన మార్కు రాజకీయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు వైసీపీ పార్టీలో కూడా బొత్స సత్యానారాయణకు బలమైన మద్దతుదారులే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఏపీ రాజధాని విషయంలో ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మునిసిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయనను కొనసాగించడమే ఉత్తమం అని జగన్ భావిస్తున్నారని టాక్. దీంతో మరిసారి మంత్రివర్గంలో బొత్స ఉండడం ఖాయమని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. మరి జగన్ నయా కేబినెట్లో ఈ నలుగురు మంత్రులు కొనసాగుతారా లేదా అనేది చూడాలి.
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.