Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
- By Prasad Published Date - 07:32 AM, Tue - 9 January 24

ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి పెరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు ఇరు వర్గాలు భౌతికదాడులు చేసుకున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జ్గా భూమ అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇటీవల నారా లోకేష్ యవగళం ముందు జరిగిన ఘర్షణలో భూమ అఖిలప్రియని పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్ చేశారు. అయితే ఇదంతా ఏవీ సుబ్బారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి తనపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారని ఆమె ఆరోపించారు. నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లన్నీ ఇంఛార్జ్ భూమ అఖిలప్రియ చూస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి సీనియర్ నేతగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి సైతం తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ సభకు ఏవీ సుబ్బారెడ్డి రాకూడదని భూమ అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేశారు. సుబ్బారెడ్డి వస్తే ఇరువర్గాల మధ్య ఘర్షణలకు దిగుతారని అధిష్టానం భావిస్తుంది. దీంతో అధిష్టానం ఏవీ సుబ్బారెడ్డిని రావొద్దని చెప్పడంతో ఆయన సభకు హాజరుకావడం లేదని చెప్పారు. అయితే ఆయన వర్గీయులు మాత్రం సభకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున సభాప్రాంగణం వద్ద మోహరించారు. ఇరు వర్గాలపై గట్టి నిఘా పెట్టారు. సభలో ఎలాంటి ఆటంకాలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చిరించారు.
Also Read: Mohammad Shami: నేడు మహ్మద్ షమీకి అర్జున అవార్డు ప్రదానం.. గతంలో 47 మంది భారతీయులకు ఈ అవార్డు..!