AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!
దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.
- By Kode Mohan Sai Published Date - 12:21 PM, Wed - 30 October 24

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. “రీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్” పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లకు టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలో ఏపీ భవన్ విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి భవన్ విభజనను ఖరారు చేశారు, దీనికి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న భవనాలను రెండు రాష్ట్రాలు కలిసి వినియోగిస్తున్నాయి.
కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం డిజైన్ ప్రక్రియను ప్రారంభించింది. గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్ వంటి మూడు ప్రదేశాల్లో భవన నిర్మాణానికి డిజైన్లు ఆహ్వానించారు. మొత్తం 11.53 ఎకరాల్లో ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ డిజైన్లు కోరింది.
బుధవారం సాయంత్రం లోపు ఆసక్తి ఉన్న గుత్తేదారులు తమ ‘ఎస్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 28 లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలంటూ రహదారులు, భవనాల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
ఢిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణకు 8.245 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్కు 11.536 ఎకరాలు కేటాయించారు, దీనికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.
తెలంగాణకు శబరి బ్లాక్లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్లో 5.245 ఎకరాలు కేటాయించబడ్డాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్కు 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్ను కేటాయించారు. నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్లో 2.396 ఎకరాలు కూడా ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.
దీంతో, ఢిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో, రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా, ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తులను 52:48 నిష్పత్తిలో ఏపీ మరియు తెలంగాణకు పంచారు.