TDP : వాల్మీకి, బోయలకు సీఎం జగన్ ద్రోహం చేస్తున్నారు – మజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాష్ట్రంలోని వాల్మీకి, బోయలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు...
- Author : Prasad
Date : 19-10-2022 - 10:12 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలోని వాల్మీకి, బోయలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఎస్టీల్లో చేర్చే అంశాన్ని అధ్యయనం చేయడానికి కొత్తగా ఏకసభ్య కమిషన్ నియామకం ద్వారా జగన్ రెడ్డి ప్రభుత్వం బోయలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని బింటోఒరియా, వాల్మీకి/బోయలపై అధ్యయనానికి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శామ్యూల్ ఆనందకుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ, జగన్ సర్కారు ఉత్తర్వులు విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకి,బోయల చిరకాల వాంఛ నెరవేరేలా చూడాల్సిన సీఎం రాజకీయ కుట్రతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారన్నారు. బోయల స్థితిగతులు తెలుసుకోవడానికి కొత్తగా కమిషన్ అవసరం లేదన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా ‘రెడ్డోచ్చ మళ్ళీ మొదలెట్టు’ చందంగా సమస్య తిరిగి మొదటికొస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీతో ఈ విషయంపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి అసెంబ్లీ తీర్మానం తరువాత కేంద్రానికి పంపిందన్నారు.