TDP : నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, మహానాడు ఏర్పాట్లపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఘటనలో అమరులైన తెలుగువాళ్లకు మరియు భద్రతా సిబ్బందికి పార్టీ తరపున అధికారికంగా నివాళులర్పించనున్నారు.
- By Latha Suma Published Date - 08:02 AM, Wed - 14 May 25

TDP : నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో కీలక సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సమావేశానికి ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, మహానాడు ఏర్పాట్లపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఘటనలో అమరులైన తెలుగువాళ్లకు మరియు భద్రతా సిబ్బందికి పార్టీ తరపున అధికారికంగా నివాళులర్పించనున్నారు. అమరుల సేవలకు గౌరవంగా, పొలిట్ బ్యూరో ప్రారంభానికి ముందు మౌనప్రార్థన నిర్వహించే అవకాశం ఉంది.
Read Also: UPSC : యూపీఎస్సీ ఛైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్
పార్టీ నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న మహానాడు ఏర్పాట్లు, విస్తృత స్థాయిలో పాల్గొనే కార్యకర్తల సదుపాయాలు, ఆహార వసతులు, సాంకేతిక ఏర్పాట్లపై సమీక్ష జరగనుంది. అలాగే, టీడీపీ – జనసేన, బీజేపీ కూటమిగా గత 11 నెలల పాలనపై సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై, ప్రభుత్వ వైఖరిపై విశ్లేషణ ఉంటుంది. ప్రజల్లో అందుతున్న స్పందనను విశ్లేషిస్తూ, మున్ముందు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు.
అమరావతి రీస్టార్ట్ ప్రాజెక్టు కూడా ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశంగా ఉండనుంది. రాజధాని పునర్నిర్మాణం, శాశ్వత నిర్మాణాల ఆరంభం, వాయిదా పడిన అభివృద్ధి ప్రాజెక్టుల పునఃప్రారంభంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. నూతన నేతలకి బాధ్యతల పంపిణీ, శాఖల సమన్వయం, కార్యకర్తల శిక్షణపై కూడా చర్చలు జరగవచ్చు. ఇక, జగన్ హయాంలో 2019-24 మధ్య టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత అంశం సైతం చర్చకు వస్తుందని అంటున్నారు. కాగా, ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజాదర్బార్ నిర్వహణ సరిగా లేదని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతోపాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించనుంది. దీని కోసం విధివిధానాలను పొలిట్బ్యూరో ఖరారు చేయనుంది.