Ananthapuram TDP: బలం, బలహీనత వాళ్లే!
తొలి నుంచి టీడీపీ బలంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ పచ్చ తమ్ముళ్లు పార్టీని కుళ్లబొడుస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళ కీచులాట అంతులేని కథగా మిగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు.
- By CS Rao Published Date - 01:58 PM, Fri - 18 November 22

తొలి నుంచి టీడీపీ బలంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ పచ్చ తమ్ముళ్లు పార్టీని కుళ్లబొడుస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళ కీచులాట అంతులేని కథగా మిగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు. చాలా మంది మంత్రులు అయ్యారు. పొలిట్ బ్యూరో మెంబర్స్ కూడా పనిచేశారు. ఈ రోజుకీ చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీతో పాటే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల మెప్పు కూడా పొందారు. ఇపుడు వాళ్లలో వాళ్లకే పడడంలేదని టాక్.
ఆ జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే మెజారిటీ సీట్లలో ఇదే సీన్ కనిపిస్తోంది. జేసీ బ్రదర్స్ టీడీపీలో కాంగ్రెస్ కల్చర్ ని ఎపుడో ప్రవేశపెట్టేశారు. ఏకంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా చేసేశారు. పార్టీలో సొంతంగా వర్గ పోరు పెంచుతున్నారు. ఆ తలనొప్పులు చంద్రబాబుకు బొప్పికట్టిస్తున్నాయని పార్టీలోని ప్రతి ఒకళ్లకు తెలిసిన విషయమే.
Also Read: AP Politics: మూడు ముక్కలాట! ఎవరికి వారే విజేతలు..!
ఆ జిల్లాలోని కల్యాణదుర్గం సీటు గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ గెలిచిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా ఉన్నారు. ఆమె పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో వైసీపీ ఓడే ఫస్ట్ సీటు ఇదేనంటూ చెప్పుకుంటారు. అలాంటి సీట్లో పచ్చ తమ్ముళ్ళు మండల స్థాయి పదవుల కోసం తగవు పడి రోడ్డున పడుతున్నారు. దీంతో వైసీపీకి వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. అలాగే, పరిటాల ఫ్యామిలీ కూడా ఒకటి కాదు రెండు అంటూ రెండు సీట్లను రిజర్వు చేసుకోవడం మొదలెట్టింది. ఒకటి ధర్మవరం రెండు రాప్తాడు. ఈ సీట్లూ తమకే కావాలంటూ ఆ ఫ్యామిలీ తిరుగుతోంది. పోనీ, ఆ రెండు చోట్లా బలం పెంచుకున్నారా అంటే ఆలోచించాల్సిందే.
గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిన పరిటాల శ్రీరాం ఈసారి ధర్మవరానికి షిఫ్ట్ కావాలని చూస్తున్నారు. అయితే అక్కడ వైసీపీ బలంగా ఉంది. దాంతో పాటు బీజేపీలోకి వెళ్ళిన వరదాపురం సూరి ఈ సీటు వైపు చూస్తున్నారు. ఆయన్ని తెచ్చి ఎన్నికల వేళకు టీడీపీ తరఫున నిలబెడతారని అంటున్నారు. సూరికి ధర్మవరంతో పట్టుంది. ఆయన గతంలో కూడా గెలిచారు. దాంతో ఆయన్ని పెట్టడమే కరెక్ట్ అన్న వాదన ఉంది. కానీ ఇంచార్జిగా తాను ఉన్నాను కాబట్టి తనకే సీటు అని పరిటాల పేచీ పెడుతున్నారట. ఇక రాప్తాడును పరిటాల సునీతకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాంతో ఈ తగవు తేలేలా కనిపించడంలేదు.
Also Read: TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్? మోడీ పై తెలుగు పౌరుషం!!
మరో వైపు ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీద సొంత పార్టీలోని నాయకులు చాలా మంది విభేదిస్తున్నారు. ఆయన తన స్టైల్ కరెక్ట్ చేసుకోవాలో లేక టీడీపీ అధిష్టానం చక్కదిడ్డాలో తెలియదుకానీ ఆయన ఉన్న చోట సీన్ అది. ఇవన్నీ చూస్తూంటే ఈసారి మెజారిటీ సీట్లు అనంతపురం జిల్లా నుంచే వస్తాయని ఆశపడుతున్న టీడీపీకి అంతర్గత గ్రూప్ సవాల్ గా మారింది. ఇప్పటీకైనా చంద్రబాబు కలుగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే రాబోవు రోజుల్లో మరింతగా విభేదాలు రోడ్డున పడితే ప్రమాదం ఉంది.