TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
- Author : Vamsi Chowdary Korata
Date : 02-06-2026 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
పనిచేయకపోతే మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్షాప్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మరోసారి అప్రమత్తం చేశారు. పనిచేసినంత కాలం పదవులకు ఇబ్బంది లేదని.. పనిచేయకపోతే పక్కనపెడతామని వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పనిచేయకపోతే పక్కనపెట్టేస్తానంటూ హెచ్చరించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్న చంద్రబాబు.. పనిచేసినంత కాలం పదవులకు ఢోకా ఉండదన్నారు. అలా కాకుండా పనిచేయకుండా ఉంటే మాత్రం నమస్కారం పెట్టి పక్కనపెట్టేస్తానని స్పష్టం చేశారు. మొన్నటి ఎన్నికల్లో చాలా మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందారని.. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకుండా జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గురించి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న చంద్రబాబు.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జూన్ నాలుగో తేదీన ఎన్డీఏ నేతల సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు.
కూటమి పార్టీల మధ్య సమన్వయం కోసం నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్టీఏ సమన్వయ కమిటీలను నియమించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బలం ఎక్కువా, తక్కువ అని చూడకుండా క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధికారంలో వారిని భాగస్వామ్యులను చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటేనే ప్రజలు ఓట్లు వేస్తారన్న సీఎం, ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు వేయరనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నోరు పారేసుకుని అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.
మరోవైపు SIR విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. మిత్రపక్షాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. 2002 తర్వాత ఏపీలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, టీడీపీ ఓట్లు తీసేసి, వైసీపీ ఓట్లు చేర్చేలా కుట్రలు చేసే అవకాశం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మాకేం సంబంధం అన్నట్లుగా ఉండొద్దని, జులై 14వ తేదీ లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ నడుచుకోవాలని సూచించారు. ఇదే సమయంలో సర్ ప్రక్రియపై శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.