Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
- By Pasha Published Date - 06:03 PM, Tue - 22 April 25

Rajya Sabha: విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్లోని ఒక రాజ్యసభ స్థానం భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. ఆ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలని జనసేన, టీడీపీ నిర్ణయించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
Also Read :KTR : నర్సింగ్లాంటి కార్యకర్తలుంటే కాంగ్రెస్ కుట్రలు సాగవు : కేటీఆర్
మే 9న ఎన్నిక
తాజాగా ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు.. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఏపీ కోటాలోని రాజ్యసభ సీటు కోసం తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికి బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏపీలోని ఒక రాజ్యసభ స్థానానికి ఏప్రిల్ 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 9న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఈ స్థానం నుంచి ఎన్నికయ్యే వారికి 2028 జూన్ వరకు పదవీకాలం ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో కూటమికి స్పష్టమైన బలం ఉంది. దీంతో ఈ ఎన్నిక నల్లేరుపై నడకే.
Also Read :Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి కూడా.. ?
అన్నామలై విషయానికొస్తే.. ఆయన 2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి 3 శాతం ఓట్లే వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీకి 11 శాతం ఓట్లు వచ్చాయి. అన్నామలై వల్లే ఈ మార్పు వచ్చిందని బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా వచ్చే సంవత్సరం (2026లో) జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకోవచ్చని కమలదళం పెద్దలు అనుకుంటున్నారు. అందుకోసమే ఏపీ నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. అయితే ఏపీ రాజ్యసభ సీటు కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేతలు మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం కూడా ట్రై చేస్తున్నారు. తమను కాదని ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలకు ఛాన్స్ ఇవ్వొద్దని వారు లోలోపల అనుకుంటున్నారు.