Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
- Author : Vamsi Chowdary Korata
Date : 02-06-2026 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 4:30-5:30 మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ పోలీసులు కనీసం దీనికైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు నిరాకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జనసేన పుట్టింది ఇక్కడే..
మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని గుర్తుచేశారు. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికిపుచ్చుకున్నట్లు చెప్పారు. తెలంగాణ సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
‘‘దశాబ్దాల ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాల ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. పోరాటాల పుట్టినిల్లయిన ఈ గడ్డకు విశిష్టమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఫ్లోరోసిస్, రైతులు, నిరుద్యోగుల సమస్యలు కేవలం రాజకీయం కావు, అవి మానవీయ అంశాలు. ప్రస్తుతం ఐటీ, వ్యవసాయ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలి. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు లభించే సమగ్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో పవన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.