Andhra Pradesh: ఏపీ వర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు మాత్రం ఎలాంటి రాత పరీక్ష లేకుండా నిబంధనల ప్రకారం ప్రత్యక్ష నియామకం చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజీ
ఈ నియామకాల్లో భాగంగా ఇప్పటికే వర్సిటీల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి సర్వీసు ఆధారంగా వెయిటేజీ కల్పిస్తూ ప్రత్యేకంగా మరో ఉత్తర్వు జారీ చేసింది. రాత పరీక్షలో ఏడాది సర్వీసుకు 0.5శాతం చొప్పున, గరిష్ఠంగా పదేళ్ల సర్వీసుకు 5శాతం వరకు వెయిటేజీ ఇస్తారు. అయితే, ఈ వెయిటేజీ పొందాలంటే అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ఇంటర్వ్యూలో కూడా ఏడాదికి ఒక మార్కు చొప్పున, గరిష్ఠంగా 10 మార్కుల వరకు వెయిటేజీ కల్పిస్తారు. ఈ మేరకు కాంట్రాక్టు అధ్యాపకుల జాబితాను పంపాలని విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం ఆదేశించింది.
వర్సిటీల వారీగా ఖాళీలు.. అర్హత మార్కులు
భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 125, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 103 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30శాతం, బీసీలకు 35శాతం, ఇతరులకు 40శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు.