Operation Sindoor: ఉగ్రవాదం ఆగేవరకూ ‘ఆపరేషన్ సిందూర్’ ఆగదు – పవన్ కళ్యాణ్
Operation Sindoor: దేశ భద్రతకు ఏ రాజకీయ భేదాలు అడ్డుకావు అని చాటిచెప్పారు. అన్ని వర్గాలు, మతాలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు
- Author : Sudheer
Date : 17-05-2025 - 7:21 IST
Published By : Hashtagu Telugu Desk
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, ప్రధాన మంత్రి మోదీ (Modi) స్పష్టంగా చెప్పారు ఇది చిన్న విరామం మాత్రమే అని. ఉగ్రవాదం పూర్తిగా ఆగే వరకూ ఆపరేషన్ కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress)కి ఈ ఆపరేషన్లో ఎలాంటి పాత్ర లేకపోవడం వల్ల వారు అసహనంగా, అసురక్షితంగా మారుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Nara Lokesh : నీకు లోకేష్ ఇష్టమా… నారా రోహిత్ ఆన్సర్ ఏంచెప్పాడో తెలుసా..?
ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్కి ప్రజలూ, నాయకులూ పూర్తి మద్దతు తెలిపారు. బీజేపీ ‘తిరంగా ర్యాలీలు’ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ కూడా ‘జైహింద్ ర్యాలీ’తో తమ మద్దతు తెలిపింది. భారత సైన్యం పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా సామాజిక సమైక్యతకు నిదర్శనంగా, ఏపీలోని పలు ఆలయాలు, మసీదులు, చర్చిల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ, దేశ భద్రతకు ఏ రాజకీయ భేదాలు అడ్డుకావు అని చాటిచెప్పారు. అన్ని వర్గాలు, మతాలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసి, శాంతి నెలకొల్పే రోజు దగ్గర్లోనే ఉందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.