Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ మరో కీలక హామీ!
ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన సభ్యత్వం గురించే చర్చ జరిగింది. 5 లక్షల సభ్యత్వాలు చేయలేని వారు, కోటి సభ్యత్వాలు ఎలా సాధించామని అడిగారు.
- By Gopichand Published Date - 03:39 PM, Mon - 31 March 25

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. ఏపీలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను జూన్ నుంచి ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ కేడర్ను కోరారు. పెన్షన్లు, అన్న క్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్టీపీసీ, బల్క్ డ్రగ్ పార్క్ వంటి విజయాలను ప్రజలకు వివరించాలని, చేసిన పనులు చెప్పకపోతే ప్రత్యర్థుల అబద్ధాలు ప్రజల్లోకి వెళతాయని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభ్యత్వం – ఒక ఎమోషన్
“ఇటీవల ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన సభ్యత్వం గురించే చర్చ జరిగింది. 5 లక్షల సభ్యత్వాలు చేయలేని వారు, కోటి సభ్యత్వాలు ఎలా సాధించామని అడిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సభ్యత్వం మనకు ఒక ఎమోషన్. యలమంచిలిలో 41 వేల సభ్యత్వాలు చేసినందుకు అభినందనలు” అని లోకేష్ తెలిపారు.
కార్యకర్తలకు ప్రాధాన్యత
“యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడి కార్యకర్తలు చెప్పారు. ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’, సోషల్ మీడియా, సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబరిచిన వారి వివరాలను ఆన్లైన్లో పెట్టాను. కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. మన ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుంది. తొలిసారి అవకాశం రాకపోయినా, మూడు విడతల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు.
Also Read: Director Sanoj Mishra Arrested: మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్.. అసలు కథ ఇదే!
పార్టీ పునర్వ్యవస్థీకరణ
“మే తర్వాత కేడర్ ప్రజల్లోకి వెళ్లాలి. మేలో కడపలో మహానాడు నిర్వహిస్తాం. ఈలోగా కుటుంబ సాధికార సమితులు, బూత్, క్లస్టర్ కమిటీలు, జిల్లా కమిటీల నియామకం పూర్తి చేస్తాం. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ నియమిస్తాం. ప్రతి మూడు నెలలకు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలి” అని సూచించారు.
యువతకు అవకాశం
“పార్టీలో యువ రక్తాన్ని నిరంతరం నింపాలని నిర్ణయించాం. ఒక నాయకుడు ఒకే పదవిలో మూడు సార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నాం. గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు అవకాశం రావాలి” అని లోకేష్ పేర్కొన్నారు.
గత అనుభవాలు – పాఠాలు
“పార్టీ కార్యకర్తలు గత అయిదేళ్లు కేసులతో నరకం అనుభవించారు. పాదయాత్రలో నా స్టూల్, మైక్ లాక్కున్నారు. రామతీర్థం వెళ్లే చంద్రబాబును అడ్డుకున్నారు. ఈ గతాన్ని మర్చిపోవద్దు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ పరిష్కరించుకొని ముందుకు సాగాలి” అని అన్నారు. “మే నుంచి రోజూ 300 మందికి శిక్షణ ఇస్తాం. సమస్యలను స్థానికంగా పరిష్కరించాలి. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లండి” అని కోరారు.