TDP : గవర్నర్ని కలిసిన నారా లోకేష్, టీడీపీ నేతలు.. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్కి వివరించిన లోకేష్
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తరపున ఎవరు పోరాడున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపై దొంగకేసులు పెట్టి వేధిస్తున్న
- By Prasad Published Date - 03:44 PM, Tue - 7 November 23

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తరపున ఎవరు పోరాడున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారిపై దొంగకేసులు పెట్టి వేధిస్తున్న తీరును గవర్నర్ కు తెలియజేశామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం, కక్షసాధింపు చర్యలపై ఈరోజు లోకేష్ నేతృత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని.. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ మరో బీహార్లా మారబోతోందని గవర్నర్ కు చెప్పామన్నారు. జగన్ కు నరనరాన కక్షసాధింపు తప్ప ఏమిలేదని ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించామని లోకేష్ తెలిపార. ప్రతిపక్షంపై ఎలా కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో చెప్పామని.., సీనియర్ నాయకులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్రను నెలల తరబడి ఎలా జైలుకు పంపించారో వివరించామని.. జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎలా వంద కేసులు పెట్టి వేధిస్తున్నారో తెలియజేశామన్నారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఎ పర్మిషన్ లేకపోయినా దొంగకేసులు పెట్టిన విషయాన్ని గవర్నర్కి తెలియజేశామని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టీడీపీ బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుందని లోకేష్ తెలిపారు.