Chandrababu : చంద్రబాబు ఇంటికి పారిశ్రామిక, సెలబ్రిటీల క్యూ
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని విశ్వసించే పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ ప్రతిరోజూ ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును కలుసుకుంటున్నారు.
- By CS Rao Published Date - 10:50 AM, Wed - 27 July 22
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని విశ్వసించే పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థిత్వాలను ఆశిస్తూ ప్రతిరోజూ ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును కలుసుకుంటున్నారు. ఆ జాబితాలో నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని ఆశిస్తూ రెండు రోజుల క్రితం ఒక బడా పారిశ్రామికవేత్త ఆయన్ను కలిసినట్టు తెలుస్తోంది. మరుసటి రోజే టాలీవుడ్ వెటరన్ హీరో మోహన్ బాబు కలవడం గమనార్హం.
ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండగా ఆయన్ను మోహన్ బాబు విభేదించారు. ఆనాడు విద్యానికేతన్ సంస్థ ఫీజు రియెంబర్స్ మెంట్ రూపంలో రావాల్సిన బకాయిల కోసం రోడ్డు ఎక్కారు. అధికారంలో ఉన్న చంద్రబాబును పలు విధాలుగా దూషించారు. ఆ తరువాత బంధువుగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి పక్షాన చేరారు. ఆయనకు బాసటగా 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. తీరా, అధికారంలోకి వచ్చిన తరువాత విద్యానికేతన్ బకాయిలను కొంత మేరకు ఇవ్వడం ద్వారా హ్యాండిచ్చారు. దీంతో ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీద అసహనంగా ఉన్న మోహన్ బాబు అడపాదడపా పలు ఛానళ్ల ఇంటర్వ్యూల్లో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పంచన చేరడానికి మార్గాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Rahul Gandhi: రాహుల్ తో సహా సీనియర్లపై ఢిల్లీ పోలీసింగ్
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బంధువుగా మోహన్ బాబు గతంలో అనేక పదవులను చేజిక్కించుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత టీడీపీ పగ్గాలను చేపట్టిన బాబు వీలున్నంత వరకు మోహన్ బాబుకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజ్యసభను ఇవ్వడం ద్వారా పెద్ద పీఠ వేశారు. అయినప్పటికీ ఆయన్ను వీడి వెళ్లడానికి ఏ మాత్రం ఆప్పట్లో మోహన్ బాబు సంకోచించలేదు. ఇప్పుడు మళ్లీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు సర్వత్రా వినిపిస్తోన్న తరుణంలో సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వర్గాల్లోని టాక్.
ఇటీవల మోహన్ బాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆయన ఫ్యామిలీ కూడా మోడీని కలిసి ఫోటోలను సోషల్ మీడియాకు అందించారు. ఆయన బీజేపీలో చేరతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా సంకేతాలను కూడా మోహన్ బాబు పరోక్షంగా ఇచ్చిన సందర్బాలు లేకపోలేదు. కానీ, ఇప్పుడు హఠాత్తుగా బాబును కలుసుకోవడంతో బీజేపీ, టీడీపీ పొత్తు అంశం తెరమీదకు వస్తుంది. ఇటీవల టీడీపీ, బీజేపీ దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి ముర్ముకు మద్ధతు ఇవ్వడం ద్వారా బీజేపీ, టీడీపీ జత కట్టే ఛాన్స్ ఉందని రూఢీ అవుతోంది. భీమరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణకు బాబుకు ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్ ద్వారా కిషన్ రెడ్డి సంప్రదింపులు జరపడం ఆ రెండు పార్టీలు ఒకే వేదికపైకి రాబోతున్నాయన్న సంకేతం వస్తుంది. బహుశా అందుకే, మోహన్ బాబు ముందడుగు వేశారా? అనే అనుమానం కలుగుతోంది.
Also Read: Prashant Kishor Report: టీఆర్ఎస్ కార్యాచరణపై ‘పీకే’ బిజీ బిజీ
మొత్తం మీద పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు చంద్రబాబు ఇంటి ముఖం పట్టారు. ప్రతి రోజూ ఎవరో ఒకరు ఆయన్ను కలుస్తూ ముందస్తు సీటు రిజర్వు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి దగ్గరగా వున్న బడా పారిశ్రామివేత్తకు సమీప బంధువు నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని ఆశిస్తూ బాబును కలవడం చర్చనీయాంశం అయింది. కానీ, ఈసారి చంద్రబాబు మునుపటి మాదిరిగా గుడ్డిగా పారిశ్రామికవేత్తలకు టిక్కెట్ ఇవ్వరని తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను తయారు చేసిన లోకేష్ ఆలోచనకు అనుగుణంగా అభ్యర్థిత్వాలు ఉంటాయని తెలుస్తోంది.
Related News
AP Politics : వైసీపీ ఎంపీపై మాజీ వాలంటీర్ పోటీ
ఆంధ్రప్రదేశ్లో అత్యంత రసవత్తరమైన బ్యాలెట్ బాక్స్ పోరుకు సిద్ధమైంది.