YSRCP : దేశంలోని అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శమన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని మంత్రి
- By Prasad Published Date - 08:39 PM, Sat - 25 November 23

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20వ రోజు సామాజిక సాధికర యాత్ర ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, మన్యం జిల్లా పాలకొండ, నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు చోట్ల జరిగిన సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జగ్గయ్యపేటలో ప్రసాదరావు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం, ఇతర పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు గౌరవం కల్పించిన ఏకైక నాయకుడని జగన్మోహన్రెడ్డి అని ఆయన కొనియాడారు. సీఎం జగన్ కేబినేట్ 17 మంది మంత్రులు వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు చెందినవారేనని మంత్రి విడదల రజిని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పార్టీ అని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా అన్నారు. మైనార్టీ సంక్షేమానికి ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 వేల కోట్లు ఇస్తే, సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో 24 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. పాలకొండలో జరిగిన బస్సుయాత్రలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి తన హయాంలో రాష్ట్రంలోని ఆదివాసీలకు మూడెకరాల భూమి ఇచ్చారని, చంద్రబాబు నాయుడు ఎకరం కూడా పంపిణీ చేయలేదన్నారు.139 కులాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హృదయాలను ఏపీ సీఎం గెలుచుకున్నారన్నారు.