Chiranjeevi : జనసేనలోకి `గాడ్ ఫాదర్`! రాజకీయాల్లోకి చిరు ఫిక్స్!!
`పవన్ నిబద్ధత, చిత్తశుద్ధి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలి.
- By CS Rao Published Date - 03:06 PM, Tue - 4 October 22
`పవన్ నిబద్ధత, చిత్తశుద్ధి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలి. వాళ్లు ఏ పక్షాన ఉంటారు. ఎలా ఉంటారు అనేది భవిష్యత్ లో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వాళ్లు రావాలని నా ఆకాంక్ష. డెఫనెట్ గా నా సపోర్టు ఉంటుంది. నేను ఒక్క పక్కన తనొక పక్కన ఉండడం కంటే, విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవడమే తను ఎమర్జ్ అవుతాడు. ప్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు. ఏమో ప్రజలు అధికారం ఇస్తారేమో. అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను.` అంటూ గాడ్ ఫాదర్ సినిమా విడుదల కోసం పెట్టిన మీడియా సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్లు చేయడం తెలుగు రాజకీయాల్లో మలుపులకు తావిస్తోంది.
ప్రజారాజ్యం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆనాడు పవన్ కల్యాణ్ ఆ పార్టీకి యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం తరువాత సైలెంట్ గా ఉన్న పవన్ జనసేన పార్టీని 2014 ఎన్నికలకు ముందుగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేయగా, పవన్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు వేదికలపై కనిపించారు. కానీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆ రోజు నుంచి సైలెంట్ గా చిరంజీవి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. హఠాత్తుగా ఇప్పుడు గాడ్ ఫాదర్ వేదికపై రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జనసేనాని పవన్ కల్యాణ్ కు ఉన్న రాజకీయ లక్షణాలను ప్రశసించారు. అంతేకాదు, పవన్ లాంటి లీడర్లు రావాలని చెప్పారు. భవిష్యత్ లో మద్ధతు పలకడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చేశారు. రాజ్యాధికారం పవన్ కు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఆయన మాటల్ని గమనిస్తే 2024 ఎన్నికల నాటికి మళ్లీ రాజకీయ చదరంగంలోకి దిగే అవకాశం ఉంది. అంతేకాదు, తమ్ముడు పవన్ కు అండగా నిలవడానికి ఏ మాత్రం వెనుకాడనని చెప్పేశారు. ఇంతకాలం మెగా ఫ్యామిలీ మధ్య ఏదో గ్యాప్ ఉందని భావించిన వాళ్లకు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా వేదికగా ఇచ్చిన క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్టు అయింది.
ఒకానొక సమయంలో జనసేనలో ఉండే వాళ్లే మెగా అభిమానులు అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య తరువాత చిరంజీవి, జనసేన కు మధ్య గ్యాప్ ఉందని భావించారు. దానికితోడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మూడుసార్లు చిరంజీవి కలవడం పలు అనుమానాలకు తావిచ్చింది. అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మోడీ ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యత చిరంజీవి రాజకీయ ప్రయాణంపై మరిన్ని అపోహలను తీసుకొచ్చింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ జనసేనానితోనే ఉంటానని చిరంజీవి తాజాగా చెప్పడం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కలకలం బయలు దేరింది.
Related News
Nagababu : తిరిగొచ్చిన నాగబాబు.. ఆ ట్వీట్ డిలీట్ చేసేసాను అంటూ..
తన ఎక్స్ అకౌంట్ ని యాక్టీవ్ చేసి మళ్ళీ తిరిగొచ్చిన నాగబాబు. రావడంతోనే మరో వైరల్ ట్వీట్ చేసారు.