DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్డీవో ఎయిర్క్రాఫ్ట్ల తయారీ భారీ ప్రాజెక్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 02-05-2026 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఏరోస్పేస్, రక్షణ రంగం పరుగులు పెట్టనుంది. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏకంగా రూ.15,000 కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ముందుకు వచ్చింది. ఈ నెల 15న సీఎం చంద్రబాబు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రాకతో శ్రీసత్యసాయి జిల్లా దేశ రక్షణ రంగ పటంలో కీలక స్థానాన్ని సంపాదించనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఏఎంసీఏ) మోడల్ యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. దేశీయంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించే ఈ విమానాలను భారత వైమానిక దళం, నౌకాదళం కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న సుఖోయ్ ఎస్యూ-30 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 600 ఎకరాల భూమిని డీఆర్డీవోకు కేటాయించింది. భవిష్యత్ అవసరాల కోసం మరో 400 ఎకరాలను కూడా అందుబాటులో ఉంచింది. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసి, 2029 నాటికి మొదటి నమూనాను సిద్ధం చేయాలని, 2035 నాటికి పూర్తిస్థాయిలో విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏరోస్పేస్ హబ్గా శ్రీసత్యసాయి జిల్లా
ఈ ఒక్క ప్రాజెక్టుతోనే కాకుండా శ్రీసత్యసాయి జిల్లా క్రమంగా ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే పాలసముద్రం వద్ద రూ.500 కోట్ల పెట్టుబడితో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) వెయ్యి ఎకరాల్లో డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్ల వ్యయంతో వెయ్యి ఎకరాల్లో డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్ను నిర్మించనుంది. ఇప్పుడు డీఆర్డీవో ప్రాజెక్టు కూడా తోడవడంతో జిల్లా పారిశ్రామిక స్వరూపం పూర్తిగా మారిపోనుంది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు కలిసివస్తోంది. బెంగళూరు చుట్టుపక్కల రక్షణ రంగ విస్తరణకు అవకాశాలు తగ్గడంతో కంపెనీలన్నీ శ్రీసత్యసాయి జిల్లా వైపు చూస్తున్నాయి. జిల్లాలోని పుట్టపర్తిలో విమానాశ్రయం అందుబాటులో ఉండటం కూడా ఈ ప్రాజెక్టులకు అదనపు బలంగా మారింది. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతానికి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.