AP Politics: జగన్ మరో ఛాన్స్ కోసం కేసీఆర్ వ్యూహం! పవన్ పై బీఆర్ఎస్ నీడ!
మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఏపీ సీఎంగా (CM) చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నారని తెలుస్తుంది.
- By CS Rao Published Date - 05:40 PM, Sun - 19 February 23
మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఏపీ (AP) సీఎంగా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నారని తెలుస్తుంది. ఆ క్రమంలో అవసరం అయిన చోట బీ ఆర్ ఎస్ పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు పవన్ పార్టీని నియంత్రించే బాధ్యతను కూడా ఆయన తీసుకొని హైదరాబాద్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఏపీ (AP) మీద మరోసారి పెద్ద కుట్రకు తెరలేచిందని రాజకీయాలను నిత్యం అధ్యయనం చేసే వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుత ప్రభుత్వ అసమర్ధ విధానాలు, పరిపాలన వలన ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందనేది సర్వత్రా వినిపిస్తుంది. ఈ వ్యతిరేక ఓటుని చీల్చడం ద్వారా మళ్ళీ జగన్రెడ్డికి లబ్ది కలిగించడం కోసమే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు.
మళ్ళీ జగన్రెడ్డే ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ఎందుకు బలంగా కోరుకుంటున్నాడో ఇప్పటికే మీకు తెలిసిందే అయినా ఒక్కసారి ఈ క్లిప్పింగ్ పరిశీలిస్తే..2013-14 నుండి 2017-18 మధ్యకాలంలో… ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి – 9.9 శాతం అయితే,తెలంగాణా ఆర్థికాభివృద్ధి – 8.6 శాతంగా ఉండేది.ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం – 10.2 శాతం ఉంటే, తెలంగాణ లో తలసరి ఆదాయం – 7.8 శాతం గా ఉండేది. EoDB ర్యాంకింగులలో కూడా ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో తెలంగాణ ఉండేది. తెలంగాణ కు కామధేనువు లాంటి హైదరాబాద్ ఉన్నా కూడా లోటుబడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్ర కంటే వెనుకబడి ఉండేది.
2019 నుండి జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ తరలిపోవడం ఒక్కటే కాకుండా జాకీ, అమరరాజా, లులు కన్వెన్షన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పరిశ్రమలు, కంపెనీలు ఎన్ని తరలిపోయాయో అందరకీ తెలుసు. ఇలాంటి పరిణామం ఉంటే తెలంగాణకు మేలు. ఇదే విషయాన్నీ అసెంబ్లీ బయట లోపల కేసీఆర్, హరీష్, కేటీఆర్ తో పాటు తెలంగాణ నేతలు కోరుకుంటున్నారు. అందుకే జగన్ ను మరోసారి సీఎం కావటాని కేసీఆర్ వ్యూహాత్మకంగా పవన్ ను పావుగా వాడుతున్నారని టీడీపీ అనుమనిస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల్ని మిస్మరైజ్ చేయగలరు. ఏది అనుకుంటే, ఆ దిశగా ప్రజల మైండ్ సెట్ ను మళ్లించే చతురత ఆయన సొంతం. లెఫ్ట్, రైట్ పార్టీలను రెండు భుజాలపై ఎక్కించుకుని రాజకీయం నడిపిన చరిత్ర ఆయనకు ఉంది. అంతేకాదు, హిందూ,ముస్లిం సమాజాన్ని ఏకకాలంలో తనకు మద్ధతు ఇచ్చేలా చక్రం తిప్పిన నేర్పరి ఆయన. ఇప్పుడు జై భారత్, జై తెలంగాణ నినాదంతో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ వాదాన్ని వినిపిస్తూ ప్రజల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నం చేయడం గమనార్హం.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన జై భారత్, జై తెలంగాణ నినాదాన్ని వినిపిస్తూ ప్రసంగాన్ని ముగించారు. అంటే, తెలంగాణ ఎన్నికల వరకు జై తెలంగాణ నినాదం. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలకు జై భారత్ స్లోగన్ వినిపించబోతున్నారు. వాస్తవంగా ఆయన ప్రాంతీయ వాదాన్ని నడిపి రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యమకాడిని కిందపడేశారు. ఫక్తు రాజకీయ పార్టీగా మాత్రమే టీఆర్ఎస్ పనిచేస్తుందని సెలవిచ్చారు. ఆ రోజు నుంచి ఉద్యమకారులను దాదాపుగా గులాబీ పార్టీకి దూరంగా పెట్టారు. ఇతర రాజకీయ పార్టీల నేతలతో ఆ పార్టీని నింపేశారు. అయినప్పటికీ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు.
యాగాలు,పూజలు చేస్తూ హిందూవాదిగా ఆ సమాజాన్ని ఒక భుజంపై కేసీఆర్ ఎత్తుకున్నారు. అదే సమయంలో ఎంఐఎంను సహజమిత్రునిగా ఉంచుకున్నారు. పర్మినెంట్ గా ఓవైసీని సొంత మనిషిగా మలచుకున్నారు. ఆ పార్టీ కేసీఆర్ ఏది చెబితే ఆ విధంగా నడిచేలా చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా ముస్లిం సమాజాన్ని కేసీఆర్ మరో భుజం మీద పెట్టుకున్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి రూపంలో సమైక్యవాదుల్లోని `రెడ్డి` సామాజికవర్గాన్ని ఆకట్టుకున్నారు. ఇంకో వైపు `కమ్మ` సామాజికవర్గానికి ఐదు ఎకరాల భూమిని హైటెక్స్ సమీపంలో కేటాయిస్తూ వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇటీవల ఎన్టీఆర్ విగ్రహానికి, ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళుతూ నివాళులు అర్పించేందుకు గులాబీ శ్రేణులను పంపడం ద్వారా కమ్మ సామాజికవర్గాన్ని సంతృప్తి పరుస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ ను నమ్ముకున్న కేసీఆర్ కు సెంటిమెంట్ కూడా గత రెండు ఎన్నికల్లో కలిసి వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకవాదాన్ని పక్కనపెడుతూ సమైక్యవాదాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశ వ్యాప్తంగా రాజకీయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే, రాష్ట్రంలో నష్టపోకుండా ప్రత్యేకవాదం సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు. ఆ దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకోసం షర్మిల పాదయాత్రను రాజకీయంగా వాడుకోవడానికి స్కెచ్ వేశారు. ఆమె పాదయాత్ర మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఆ లోపుగా వీలున్నంత ఆంధ్రా సెంటిమెంట్ వేడిని రగిలించాలని కారు పార్టీ కాకమీద ఉంది. అంటే, రాష్ట్రంలో ఆంధ్రా సెంటిమెంట్ దేశంలో భారత్ సెంటిమెంట్ ను కేసీఆర్ నమ్ముకున్నారన్నమాట. ఆ రెండు రకాల సెంటిమెంట్లను సమాంతరంగా ప్రజల మధ్యకు తీసుకెళతారు అనేది ఆసక్తికరం.
ఇక ఏపీ (AP) మీద తెలంగాణ ఫలితాల ప్రభావం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి , కేసీఆర్ పరస్పరం సహాయం చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న టీడీపీ ప్రజల్లో వాళ్లిద్దరి పొలిటికల్ డ్రామాను బయట పెట్టె ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో జగన్ , బాబు హయాంలో తెలంగాణ, ఏపీ (AP) అభివృద్ధి ర్యాంకులు బయటకు తీశారు. వాటిని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇది ఎంత వరకు జగన్, కేసీఆర్ ఎత్తుగడలని బ్రేక్ చేయగలదు అనేది చూడాలి.
Also Read: Tongue Health Tips: నాలుక తెల్లగా ఉందా? ఆ వ్యాధుల ముప్పు..
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.