Pithapuram : టీడీపీ కార్యకర్తలపై జనసేన కేసులు.. పంచాయితీ ముదురుతుందా?
Pithapuram : “జై వర్మ, జై టీడీపీ” అంటూ నినాదాలు చేయగా, ప్రతిగా జనసేన శ్రేణులు “జై జనసేన, జై పవన్ కళ్యాణ్” అంటూ గట్టిగా నినాదాలు చేసారు.
- By Sudheer Published Date - 05:13 PM, Sun - 6 April 25

పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో టీడీపీ మరియు జనసేన శ్రేణుల (TDP Vs Janasena) మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 15 ఏళ్లపాటు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నియోజకవర్గం లో మాత్రం భిన్న వాతావరణం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన కొణిదెల నాగబాబు (Nagababu) పిఠాపురంలో పర్యటించగా, ఈ పర్యటన పెద్ద దుమారం రేగింది.
Peddi First Shot Glimpse : ‘పెద్ది’ పూనకాలు తెప్పించాడు
నాగబాబు పర్యటన సందర్భంగా టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సమయంలో, చినజగ్గంపేట వద్ద టీడీపీ శ్రేణులు “జై వర్మ, జై టీడీపీ” అంటూ నినాదాలు చేయగా, ప్రతిగా జనసేన శ్రేణులు “జై జనసేన, జై పవన్ కళ్యాణ్” అంటూ గట్టిగా నినాదాలు చేసారు. ఈ ఘర్షణలపై ఓ జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేయగా, రెండు కేసులు టీడీపీ శ్రేణులపై నమోదు అయినట్లు సమాచారం.
ఈ గొడవలకు కారణం ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనకు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకి ఆహ్వానం లేకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి. పవన్ విజయంలో తానే కారణమని భావించేవారి ‘ఖర్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలు స్థానిక టీడీపీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీశాయి. కూటమి ధర్మానికి భిన్నంగా జరగుతున్న ఈ పరిణామాలు పిఠాపురంలో రాజకీయ వేడి పెంచుతున్నాయి. మరి ఈ వేడి చల్లారుతుందా..? ఇంకా పెరుగుతుందా అనేది చూడాలి.