Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు కావాలి: సీఎం చంద్రబాబు
- By Kode Mohan Sai Published Date - 02:33 PM, Fri - 11 October 24

Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా జగన్ను పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఈ విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్ర పన్నినవాళ్లు వరదల్లో మా పనితీరును విమర్శిస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో ₹75 వేల కోట్లతో రైల్వే మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. బెంగళూరు-చెన్నై-అమరావతి-హైదరాబాద్ నగరాలను కలిపేందుకు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్రం వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లుతున్నప్పుడు, అభినందించడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రణాళికలు రూపొందించడం మాత్రమే కాదు:
దేశంలో 7% వృద్ధి రేటు ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన తెలిపారు. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు.
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే కాకుండా, పీఎం సూర్య ఘర్ ద్వారా ఇంటింటికీ సౌరశక్తి అందించేందుకు కృషి చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వనరులను సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు సాధ్యం అని చెప్పారు.
ప్రణాళికలు వేయడమే కాకుండా, వాటిని సరిగ్గా అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి మనదేశం అన్నింటిలో అగ్రగామిగా ఉండాలని ఆయన కోరారు.
జగన్ విధ్వాంసాకార పాలనా:
విధ్వంసకర పాలన వల్ల ఏపీ ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లుగా చూశామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హరియాణాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందని, సుపరిపాలన వల్ల ప్రజలు పొందే లాభాలను వారు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం పని చేసే విధానం హరియాణాలో గెలుపుకు కారణమైందని పేర్కొన్నారు.
హరియాణాలో ఈ విజయం ఎన్డీఏకు శుభ సంకేతమని, మోదీ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారని చంద్రబాబు అన్నారు. సుస్థిరత, అభివృద్ధికి హరియాణా ప్రజలు ఓటేశారు అని ఆయన వివరించారు.