Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Author : Gopichand
Date : 03-04-2025 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. సీబీఐ ఆ రోజు జగన్ను విచారించిందని, టీవీ బాంబుతో పాటు కారు బాంబు, సూట్కేస్ బాంబు వంటి ఘటనలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తోపుదుర్తి సోదరులు స్వార్థం కోసం ఫ్యాక్షన్ను రెచ్చగొడుతున్నారని, ఓబుల్ రెడ్డి, మద్దలచెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారని ఆరోపించారు.
సునీత, గంగుల భానుమతి, కనుముక్కల ఉమాలకు ఆమె విజ్ఞప్తి చేస్తూ ఫ్యాక్షన్ వల్ల తమ మూడు కుటుంబాలు నష్టపోయాయని, దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని, ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదుర్తి సోదరులు మళ్లీ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పాపంపేటలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చారని, దీనిని రెచ్చగొట్టేందుకు బాధితులను ఉసిగొల్పుతున్నారని తెలిపారు.
Also Read: India vs Pak War: భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే.. ఎవరు గెలుస్తారు ?
ఎంపీపీ ఎన్నికల్లో తాను జోక్యం చేసుకోలేదని, అలా చేసి ఉంటే రామగిరి ఎంపీపీ టీడీపీ వశం అయ్యేదని స్పష్టం చేశారు. తోపుదుర్తి సోదరులు చంద్రబాబు, లోకేష్లపై అనుచితంగా మాట్లాడి, ఇప్పుడు కేసుల భయంతో వారిని గౌరవంగా సంబోధిస్తున్నారని విమర్శించారు. జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా తోపుదుర్తి సోదరుల మాటలు వింటున్నారని, శుక్రవారం పాపిరెడ్డిపల్లికి వస్తానంటూ ఫ్యాక్షన్ను రగిలించవద్దని సూచించారు. లింగమయ్యతో పాటు వైఎస్ఆర్సీపీ బాధితులను కూడా పరామర్శించాలని కోరారు.
పరిటాల రవి ఎలా చనిపోయారు?
పరిటాల రవి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ఘటనల్లో ఒకటి. పరిటాల రవి 2005 జనవరి 24న అనంతపురం జిల్లాలోని పెనుకొండలోని పార్టీ కార్యాలయం వద్ద బహిరంగంగా కాల్పులకు గురై హత్య చేయబడ్డాడు. ఈ దాడిలో అతని గన్మన్, సన్నిహిత అనుచరుడు కూడా మరణించారు. ఈ హత్య వెనుక దీర్ఘకాలంగా నడుస్తున్న కుటుంబ వైరం, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రధాన కారణాలుగా చెబుతుంటారు. పరిటాల రవి- కాంగ్రెస్ నాయకుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి (మద్దలచెరువు సూరి) కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.