Three capitals of Andhra Pradesh: హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు..?
- By HashtagU Desk Published Date - 11:14 AM, Sat - 5 March 22
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో, సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, హోంమంద్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిటీ తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సుచరిత వెల్లడించారు.
ఇక రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్రం చెప్పిందని సుచరిత గుర్తుచేశారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగానే ఉంటుందని, అయితే మొత్తం తరలిస్తున్నట్లు కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వానికి స్పష్టత ఉందని సుచరిత తేల్చిచెప్పారు. ఇక రాజధాని విషయంలో ప్రభుత్వానికి శాసనాధికారం లేదని తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక హోంమంత్రి సుచరిత మాత్రమే కాదు, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని వైసీపీ నేతలంతా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ విషయం పై క్లారిటీగా ఉన్నారు. విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా, అమరావతి – శాసన, కర్నూలు – న్యాయ రాజధానులుగా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలసిందే. అంటే విశాఖపట్టణంలో సెక్రటేరియట్, గవర్నర్ కార్యాలయం, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, మూడు రాజధానుల విషయంలో మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగానూ, న్యాయపరంగానూ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరుస్తామని వైసీపీ ప్రభుత్వం అంటుంది. అయితే మరోవైపు హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా, మార్చి 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కార్.. మూడు రాజధానుల కొత్త బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా ఏపీలో రాజధాని అంశం వచ్చే ఎన్నికల్లో కీలక అస్త్రం కానుందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
Related News
AP Election Result 2024: జగన్ vs చంద్రబాబు… ప్రజలు ఎవర్ని నమ్మారు ?
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఆధిపత్య పోరుగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.