Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
- By Latha Suma Published Date - 01:27 PM, Mon - 14 July 25

Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మోడల్గా నిలబెట్టాలనే లక్ష్యంతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక అడుగు వేశారు. స్వచ్ఛతలో నంబర్వన్ మున్సిపాలిటీగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను తీర్చిదిద్దేందుకు అధికారులు చాలెంజ్గా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను సులభంగా తరలించే రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ వాహనాలు, రోడ్లను శుభ్రంగా క్లీన్ చేసే రెండు స్వీపింగ్ మెషీన్లు, బ్లాక్టాప్ రోడ్లపై గుంతలు పూడ్చే పాత్హోల్ రిపేర్ వాహనం ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం
బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో మాత్రమే ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న అత్యాధునిక రిఫ్యూజ్ కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలో తొలిసారి మంగళగిరికి అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క వాహన ఖరీదు సుమారు రూ.95 లక్షలు. కూలీలు సేకరించిన చెత్తను ట్రాక్టర్లు లేదా ఆటోల ద్వారా ఈ కాంపాక్టర్ వాహనాల వద్దకు తీసుకురావడమేగాక, అవి డైరెక్ట్గా డంపింగ్ యార్డ్కు తరలిస్తాయి. దీనివల్ల మురికివాడలు, చెత్త కుప్పల సమస్యను పూర్తిగా అరికట్టవచ్చుననే ఆశ ఉంది. ఇక, రోడ్లను గుంతలబారిన పడకుండా చేయాలంటే వెంటనే మరమ్మతులు అవసరం. ఇందుకోసం రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనం మంగళగిరికి ప్రత్యేకంగా వచ్చినది. ఇది ఒక రోబోటిక్ మెకానిజంతో పనిచేస్తుంది. చిన్న గుంతలైనా వెంటనే పూడ్చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో ట్రాఫిక్కు ఆటంకం లేకుండా, ప్రయాణికులకు రక్షణగా మారుతుంది. దీనితో పాటు, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే స్వీపింగ్ మెషిన్ వాహనాలు రెండు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో వాహన ఖరీదు సుమారు రూ.60 లక్షలు.
వీటి సహాయంతో బస్సు స్టాండ్లు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో రోజువారీ శుభ్రత మరింత మెరుగుపడనుంది. మంగళగిరి నియోజకవర్గాన్ని గుంతలేని రహదారులు, శుభ్రతలో నెంబర్ వన్ కార్పొరేషన్గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ మాత్రమే కాదు… ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే ఉద్యమం కూడా అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేస్తే 100 రోజుల్లో మార్పు తెచ్చేందుకు ఇది చక్కటి అవకాశం అని ఆయన వివరించారు. మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత, వేగం, నాణ్యత ప్రమాణాలకు ఇది నూతన శకం కావచ్చని రాజకీయ, అభివృద్ధి వర్గాల్లో విశ్లేషణ మొదలైంది.కాగా, ఒకప్పుడు గుంతలతో నిండిన రోడ్లు, చెత్త కుప్పలతో వాడివాడలా దుర్వాసనతో మంగళగిరి నగరం, ఇప్పుడు శుభ్రతలో మెట్రోశహరాలకు పోటీ పడేలా మారుతోంది. లోకేశ్ ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేస్తే… మంగళగిరి త్వరలోనే రాష్ట్రంలోని మోడల్ టౌన్గా నిలవడం ఖాయం.
Read Also: Mohammad Siraj: సిరాజ్కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 15% కోత, ఒక డిమెరిట్ పాయింట్!