కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్లైన్లో!
- Author : Vamsi Chowdary Korata
Date : 17-12-2025 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
- కాణిపాకం ఆలయం ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి
- దర్శనం, గదులు, సేవలు ఆన్లైన్లో బుక్ చేస్కోవచ్చు
- వెబ్సైట్, వాట్సాప్ ద్వారా టికెట్లు అందుబాటులోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఆన్లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించగా.. తాజాగా కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇకపై కాణిపాకం ఆలయానికి వెళ్లే భక్తులు దర్శనం, వసతి, సేవ, ఆర్జిత సేవ, ప్రసాదం టికెట్లు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు కొత్తగా వెబ్సైట్ కూడా ప్రారంభించారు.. వాట్సప్ ద్వారా కూడా ఈ సేవలు పొందొచ్చు. ఇకపై ఈజీగా ఆన్లైన్ ద్వారా సేవలు పొందొచ్చు.
కాణిపాకం ఆలయానికి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి నిత్యం దాదాపు 25వేలమంది వరకు భక్తులు దర్శనానికి వస్తారు. అదే వీకెండ్ అయితే ఈ సంఖ్య 45వేల వరకు ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కాణిపాకం గణపయ్యను దర్శానికి వెళతారు. వీరిలో ఎక్కువశాతం భక్తులు స్వామివారి ఆర్జిత, ఇతర సేవలకు ఆసక్తిగా ఉంటారు.. ఈ సేవా టికెట్లు కావాలంటే గతంలో నేరుగా ఆలయానికి వచ్చి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం దక్కింది.
కాణిపాకం వచ్చే భక్తులు.. https://www.srikanipakadevasthanam.com పేరుతో ఉన్న వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ దేవాదాయశాఖ అధికారిక వెబ్సైట్ అయిన https://www.aptemples.ap.gov.in, వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా సేవలు పొందవచ్చు. కాణిపాకం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కొన్నిచోట్ల ఆన్లైన్ సేవా టికెట్ల జారీ కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆలయం దగ్గరే కౌంటర్ ఉంది.. అక్కడ సిబ్బంది ఆన్లైన్లో సేవా టికెట్లు ఇస్తున్నారు. భక్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తామని.. అలాగే కాణిపాకం ఆలయంలో భక్తుల కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాణిపాకం వచ్చే భక్తులు ఆన్లైన్ సేవలను భక్తులు వినియోగించుకోవాలని ఆలయ ఈవో సూచించారు.