Nara Lokesh: టీడీపీలో నాలుగుస్తంభాలట!
ఏ ప్రభుత్వానికైనా ప్రజా వ్యతిరేకత ఉండడం సర్వసాధారణం. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షం ఓటు బ్యాంకుగా మలుచుకోగలగాలి. అప్పుడే ప్రభుత్వాలు మారడానికి అవకాశం ఉంటుంది.
- By CS Rao Published Date - 12:35 PM, Fri - 6 May 22
ఏ ప్రభుత్వానికైనా ప్రజా వ్యతిరేకత ఉండడం సర్వసాధారణం. ఆ వ్యతిరేకతను ప్రతిపక్షం ఓటు బ్యాంకుగా మలుచుకోగలగాలి. అప్పుడే ప్రభుత్వాలు మారడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని వివిధ సర్వేల సారాంశం. మూడు ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ ప్రజా వ్యతిరేకత జగన్పై కనిపించింది. కానీ, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రజలను ఆకట్టుకునే విషయంలో తడబడుతోందని చెప్పడానికి కొన్ని దృష్టాంతాలను తీసుకోచ్చు. అమరావతి రాజధాని, కరెంట్ కోతలు, రోడ్ల దుస్థితి, మాజీ మంత్రుల అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి, రాయపూడిలోని చంద్రబాబు ఇంటిని కూల్చే ప్రయత్నం, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య, టీడీపీ లీడర్ల హత్యలు, రాష్ట్రంలో జరుగుతోన్న అత్యాచారాలు..ఇలా ఎన్నో జగన్ సర్కార్ వచ్చిన తరువాత జరిగిన సంఘటనలు. వాటిపై ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కార్యక్రమాలను చేపట్టింది. కానీ, పీఆర్సీ కోసం ఉద్యోగులు చేపట్టిన `ఛలో విజయవాడ` కార్యక్రమం తరహాలో ప్రధాన ప్రతిపక్షం పోరాటాలను చేయలేకపోయింది. కేంద్ర కార్యాలయం నుంచి వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి టీడీపీ క్యాడర్ పెద్దగా స్పందించడంలేదు. ఆ విషయాన్ని గమనించిన చంద్రబాబు తాజాగా `బాదుడే బాదుడు` కార్యక్రమానికి నేరుగా హాజరు అవుతున్నారని టాక్.
తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ ఫ్రేమ్ తప్పడం కారణంగానే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో విజయవంతం చేయలేక పోతోంది. ఆ విషయాన్ని పార్టీ సీనియర్ లీడర్లు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. వాస్తవంగా ప్రస్తుతం ఉన్న టీడీపీ నలుగురు యువకులు నడుపుతున్నారని ప్రైవేటు సంభాషణల్లో సీనియర్లు చర్చించుకుంటున్నారు. వాళ్లలో ఒకరు ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ మాటను బహిరంగంగానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు చెబుతున్నారు. ఆయన తరహాలో పలువురు సీనియర్లు వివిధ సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. చెన్నై కేంద్రంగా ఉన్న ఒక యువకుడు టీడీపీని తెరవెనుక నడిపిస్తున్నాడని తెలుస్తోంది. ఆయన 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్ల పాటు సచిలయంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. కానీ, రహస్యంగా మాత్రం తెరవెనుక పావులు కదుపుతున్నారట.
కేంద్ర కార్యాలయంలోనే ఉండే మరో యువకుడు చాలా కాలంగా లోకేష్ స్నేహితునిగా మెలుగుతున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయనకు పార్టీ ఆఫీస్ లో ప్రాధాన్యం లభిస్తోంది. న్యూస్ ఛానల్ ను నిర్వహించడంలోనూ ఒకప్పుడు ఆ యువకుడు కీ రోల్ పోషించాడు. ప్రత్యేక రాష్ట్ర విభజన టైం నుంచి పార్టీ తీసుకునే కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం పరోక్షంగా ఉంటోందట. ఇప్పుడ ఏపీ టీడీపీని నడిపించడానికి ఒక పిల్లర్ గా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తాజా మరో యువకుడు ఇటీవల పార్టీలో అందరికంటే ఎక్కువగా చాణక్యాన్ని నడుపుతున్నాడు. చంద్రబాబు, లోకేష్ తరువాత ఆ యువకుడే ప్రత్యక్షంగా క్యాడర్ తో మెలుగుతున్నాడు. రాబోవు రోజుల్లో టీడీపీ టిక్కెట్ కావాలంటే ఆ యువకుని ఆశీస్సులు తప్పదని పార్టీలోని అంతర్గత చర్చ. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఛానళ్లలోని ఒకరిద్దరు జర్నలిస్టులతో కలిసి ఆయన విచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఆ యువకుని వ్యవహారం నచ్చకపోవడంతో ఇటీవల కొందరు లీడర్లు పార్ట ఆఫీస్ కు దూరంగా ఉంటున్నారని టాక్. మాజీ మంత్రులు కొందరు అతని వాలాకాన్ని గురించి మాట్లాడుకోవడం టీడీపీ క్యాడర్ గుర్తించిందట.
టీడీపీ అనుకూల మీడియాను ఆ యువకుడే నడిపిస్తున్నాడని టాక్. అందుకే, ఆయన ప్రసన్నం కోసం జిల్లాల నుంచి ఆనేక మంది పార్టీ కేంద్ర ఆఫీస్ కు వస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ల సైతం ఆ యువకుడ్ని కాదని చంద్రబాబు, లోకేష్ ను నేరుగా కలవలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. రాబోవు రోజుల్లో టిక్కెట్ల కేటాయింపు కూడా అతను ఇచ్చే సమాచారం ఆధారంగా ఉంటుందని ఇప్పటికే క్షేత్రస్థాయికి తెలిసిపోయింది. అందుకే, కొందరు పైరవీకారులు ఆయన ప్రసన్నం కోసం రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారట. అనుకూల మీడియాలోని ఇద్దరు జర్నలిస్ట్ ల రికమండేషన్ తో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురికి టిక్కెట్ ఇప్పించే ప్రయత్నం పార్టీ ఆఫీస్ లో గుప్పుమనడంతో ఆ యువకుని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద లోకేష్ తో పాటు మరో ముగ్గురు యువకులు తెలుగుదేశం పార్టీని హ్యాండిల్ చేస్తున్నారని సీనియర్లు చెప్పుకోవడం వినిపిస్తోంది. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రత్యర్థి ఎత్తుగడలను పసిగట్టడంలో ఆ ముగ్గురికీ ఏ మాత్రం అనుభవం లేదు. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని యువకులకు పార్టీని అప్పగించారని పార్టీ ఆఫీస్ లోని గుసగుసలు.పైగా ఆ ముగ్గురికీ సీనియర్లను కలుపుకునిపోలేని పరిస్థితి టీడీపీలో నెలకొంది. ఫలితంగా చంద్రబాబు, లోకేష్ ను నేరుగా కలవాలంటే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరి ఆశీస్సులు ముందుగా పొందాలి అనే టాక్ క్షేత్రాస్థాయికి వెళ్లింది. దీంతో జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజల్ని ఆకట్టుకోవడంలో టీడీపీ ఎప్పటికప్పుడు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. అందుకే, ప్రతిపక్షం బలహీనత అధికారపక్షానికి ఏపీలో తిరుగులేని శక్తిగా పనిచేస్తోందని భావించడంలో తప్పులేదేమో!
Related News
Balakrishna Nomination : హిందూపురంలో నామినేషన్ వేసిన బాలకృష్ణ
తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు