CM Chandrababu : వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు : సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
- By Latha Suma Published Date - 10:45 AM, Wed - 5 March 25

CM Chandrababu : ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంపై మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం కట్టుకుంటే మేం అడ్డుకున్నామా? గోదావరి వృథాజలాల ఆధారంగా బనకచర్ల కట్టుకుంటే తప్పేమిటి?’ అంటూ వ్యాఖ్యానించారు. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నీళ్లు వాడుకుంటే ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని.. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అందుకు తాము అడ్డు చెప్పలేదన్నారు. తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Read Also: Invalid Votes: అవగాహనా రాహిత్యం.. ఎమ్మెల్సీ పోల్స్లో భారీగా చెల్లని ఓట్లు
తెలంగాణ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోవాలని సైతం చెప్పా. ఏటా 1000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదని చెప్పడం సరికాదని’ చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నీళ్లు బనజకచర్లకు తీసుకెళ్తాం. బంగాళాఖాతంలో సముద్రంలోకి పోయే వృథానీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు అని తెలంగాణకు ప్రజలను కోరుతున్నా. ఏపీ విభజన సమయంలోనూ 2 ప్రాంతాలు సమానమని, 2 కళ్లు అని, సమన్యాయం చేయాలని కేంద్రాన్ని అడిగాను. ఇక్కడ అధికారం రాగా, తెలంగాణలో 20 స్థానాలు ఇచ్చారు.
ఇక, ఎన్డీయే కూటమి నుంచి విజయం సాధించి ఎమ్మెల్సీలు పేరాబత్తలు రాజశేఖరం, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లకు అభినందనలు. 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో, 93 శాతం స్ట్రైక్రైట్తో గెలిచాం. తాజాగా పోటీ చేసిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాం. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా నెగ్గిన గాదె శ్రీనివాసులుకు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని మనం పిలుపునిచ్చాం. 2023లో జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటామని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటతో సర్వనాశనం చేసింది. రాజధాని అమరావతిని స్మశానం అన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం రూ.15 వేల కోట్లు అందించింది. 72 శాతం పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. మనం మళ్లీ గెలిచింటే 2020కి పోలవరం పూర్తయ్యేది. కానీ చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల డయాఫ్రంవాల్ కొట్టుకుపోయిందన్నారు.