CM Chandrababu: తిరుమలలో కల్తీ ప్రసాదాల చెక్.. FSSAI ల్యాబ్ ప్రారంభించిన చంద్రబాబు
- Author : Vamsi Chowdary Korata
Date : 21-03-2026 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
CM Chandrababu Naidu Inaugurates Fssai Lab ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. కొత్త ల్యాబ్ పనితీరును అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో పిండిమర ప్రాంతంలో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేస్తారు. మొత్తం 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో, రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ నిర్మించారు. తిరుమలలో భక్తులకు లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలను మరింత నాణ్యతగా, రుచిగా అందించేందుకు నీరు, ముడిసరుకులు, ఇతర పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై దుమారం రేగింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం 2024 అక్టోబరు 8న ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుమలలో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశాయి. ఈ ల్యాబ్లో ప్రధానంగా ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల్ని పరీక్షించేలా ల్యాబ్ ప్లాన్ చేశారు. దేశంలోనే తొలిసారి ఒక ఆలయంలో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఘనత దక్కింది.
ఈ ల్యాబ్లో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ ల్యాబ్లో యాంటీ బయోటిక్స్, పురుగు మందుల అవశేషాలు, లెడ్, ఆర్సెనిక్ వంటి వాటిని గుర్తించే పరికరాలు ఉన్నాయి. ఈ ల్యాబ్కు త్వరలోనే ఫ్రాన్స్ నుంచి రూ.3 కోట్ల విలువైన ఈ-నోస్, ఈ-టంగ్ పరికరాలు కూడా రాబోతున్నాయి. తిరుమలలో అందించే జలప్రసాదం నమూనాలు కూడా ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. తిరుమలలో భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. చంద్రబాబు తిరుమలలో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44 లక్షల ఖర్చును విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో కీలక సమీక్ష చేశారు.