కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!
- Author : Vamsi Chowdary Korata
Date : 17-12-2025 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రైనీ కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్ వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రోజున మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు చంద్రబాబు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. డిసెంబర్ 22 నుంచి వీరికి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు చంద్రబాబు తీపికబురు వినిపించారు.
శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం అందించే స్టైఫండ్ మొత్తాన్ని రూ.4500 నుంచి, ఒకేసారి మూడు రెట్లు పెంచి, రూ.12,500 చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వేదికపై నుంచి ప్రకటించారు. దీంతో ట్రైనీ కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఏపీ యువత కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నాలుగు సంవత్సరాలు ఎదురుచూశారన్న చంద్రబాబు.. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్పై వేసిన కేసులను అధిగమించి.. ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
తన హయాంలోనే 23 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తాయని.. వేరేవాళ్లు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు పోతాయని చంద్రబాబు అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో మాట్లాడిన హోం మంత్రి వంగలపూడి అనిత.. నాలుగేళ్ల తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థుల కల ఇవాళ సాకారమైందని అన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలపై కోర్టులో కొంతమంది కేసులు వేశారని, ఆ కేసులను పరిష్కరించుకొని.. నియామక పత్రాలు అందజేశామన్నారు. ప్రజా భద్రతే ప్రగతికి పునాది అనే నమ్మకంతో పని చేస్తున్నామన్నారు.
పోలీస్ యూనిఫామ్ను బాధ్యతగా భావించాలని.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలని కానిస్టేబుల్ అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థుల తల్లిదండ్రులు కూడా పోలీస్ ఉద్యోగంలో ఉండే కష్టాలను అర్థం చేసుకోవాలని హోం మంత్రి అనిత సూచించారు.