MLC elections : రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని చెప్పట్లేదు: సీఎం చంద్రబాబు
మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని నేతలకు సూచించారు.
- By Latha Suma Published Date - 02:33 PM, Fri - 31 January 25

MLC elections : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్యాడ్యుయేట్ను కలిసి భారీ మెజారిటీ సాధించాలని… చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్ధులుగా బలపరిచామన్నారు. రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని.. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయని తెలిపారు.
ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదని పేర్కొన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని.. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని.. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయని అన్నారు. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలని సూచనలు చేశారు. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.