CJI NV Ramana : విజయవాడలో సివిల్ కోర్టు కాంప్లెక్స్ను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ
విజయవాడలో రూ.100 కోట్లతో నూతనంగా నిర్మించిన తొమ్మిది అంతస్తుల సివిల్ కోర్టు సముదాయాన్ని...
- Author : Prasad
Date : 20-08-2022 - 4:13 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలో రూ.100 కోట్లతో నూతనంగా నిర్మించిన తొమ్మిది అంతస్తుల సివిల్ కోర్టు సముదాయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు హాజరయ్యారు. ఈ కాంప్లెక్స్లో 29 కోర్టు హాల్స్తో పాటు విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. ప్రతి అంతస్తులో బార్ అసోసియేషన్ న్యాయవాదుల కోసం ఒక హాల్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల కోసం ప్రత్యేక గదులు, ప్రత్యేక లిఫ్ట్లు. అంతేకాకుండా ప్రజల కోసం ఒక ఆడిటోరియం, క్యాంటీన్ ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సీజేఐ ఎన్వీ రమణ 2013లో ఇక్కడ సివిల్ కోర్టు కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. 2017 నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఆలస్యమైంది. అంతకుముందు నోవాటెల్లో సీఎం, ఆయన సతీమణి వైఎస్ భారతి సీజేఐని కలిశారు. ఎన్వీ రమణ, జగన్ రెడ్డి మధ్య రెండు నిమిషాల పాటు భేటీ జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో సమావేశమయ్యారు.