Bonda Uma : ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు వస్తున్నాయి.. బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు..
తాజాగా తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ(Bonda Uma) సంచలన ఆరోపణలు చేశారు.
- By News Desk Published Date - 08:30 PM, Wed - 16 August 23

ఇటీవల తిరుమల(Tirumala) నడకదారిలో చిరుతపులి(Leopard) ఓ చిన్నారిని చంపేయడం, మరో చిరుత కనపడటం సంచలనంగా మారింది. ఇక దీనిపై టీటీడీ(TTD) సమావేశం పెట్టి కాలినడకన వెళ్లే భక్తులకు ఒక కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సమస్యకు పరిష్కారం చూడకుండా తుగ్లక్ లాగా కర్రలు ఇస్తాం చిరుతలు వస్తే భయపెట్టండి అని చెప్తున్నారంటూ భక్తులు, ప్రతిపక్షాలు, ప్రజలు టీటీడీపై విమర్శలు చేస్తున్నారు.
తాజాగా తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ(Bonda Uma) సంచలన ఆరోపణలు చేశారు.
బోండా ఉమా నేడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయి. వైసీపీలో ‘పుష్పా’లు ఎక్కువయ్యారు. వైసీపీ పుష్పాలు తిరుమల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్ఛగా చేస్తున్నారు. ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయి. చిరుతపులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట. ఆ రూళ్ల కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలి. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక, తగు జాగ్రత్తలు తీసుకోలేక రూళ్ల కర్ర ఇస్తారా? అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు, తుగ్లక్ చేష్టలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. మరి బోండా ఉమా చేసిన మాటలకు వైసీపీ నాయకులు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి.
Also Read : TTD : వర్షాలు కురవాలని టీటీడీ యాగాలు..