Amaravati Farmers : ఐదేళ్ల తర్వాత అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్..!
Amaravati Farmers : ఇటీవల, లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్, అమరావతి రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని ఇతర బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది
- Author : Sudheer
Date : 05-08-2025 - 9:47 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి రాజధాని రైతులకు (Amaravati Farmers) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరట లభిస్తోంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు పడిన రైతులు, ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని చెప్పడం, పనులను తిరిగి ప్రారంభించడం వంటి చర్యల వల్ల రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, బ్యాంకులు కూడా రైతులకు రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది గత ఐదేళ్ల కష్టాలనుంచి బయటపడటానికి రైతులకు ఒక పెద్ద సహాయంగా మారింది.
అమరావతి రాజధాని (Amaravati Capital) నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం వారికి రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించింది. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అమరావతిపై మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్లాట్ల విలువ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా, బ్యాంకులు ఈ ప్లాట్లపై రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లపై రుణాలు రాకపోవడంతో, చాలా మంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్
అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమరావతిలో రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకుంటుందనే నమ్మకంతో బ్యాంకులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇటీవల, లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్, అమరావతి రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని ఇతర బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతర బ్యాంకులు కూడా రైతులకు రుణాలు మంజూరు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఆదేశాలు రైతులకు ఆర్థికంగా ఒక పెద్ద ఊరట కలిగించాయి.
నిజానికి.. గత ఫిబ్రవరిలోనే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణాలిచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయి. కానీ ఆచరణలో అవి అమలు కాలేదు. దీంతో ఇటీవల రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, లీడ్ బ్యాంక్ ఇతర బ్యాంకులకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో రైతులు ఇప్పుడు తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నారు.