Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2026 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh ఏపీ పారిశ్రామిక రంగంలో మరో సంచలనం నమోదు కాబోతోంది. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాదు.. సెక్యూరిటీ, షిప్ బిల్డింగ్ రంగాల్లోనూ ఏపీ సత్తా చాటుతోంది. కూటమి ప్రభుత్వ చొరవతో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఏర్పాటు కాబోతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది.
ఏపీని అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని పారిశ్రామికంగా, వ్యూహాత్మకంగా ఎలా వాడుకోవాలో ఆలోచించిన ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అటానమస్ మారిటైం షిప్ యార్డు’ నిర్మాణానికి మంత్రి లోకేష్ పునాదిరాయి వేయబోతున్నారు.
రక్షణ రంగ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఇక్కడ మనుషుల ప్రమేయం లేకుండా.. పూర్తిగా అటానమస్గా పనిచేసే అత్యాధునిక నౌకలను తయారు చేయనున్నారు. దేశ రక్షణ, సముద్ర రవాణా రంగాల్లో ఈ AI బేస్డ్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్గా మారబోతోంది. ఇలాంటి హై-ఎండ్ టెక్నాలజీతో కూడిన షిప్ యార్డ్ ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం.
అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూసేలా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సృష్టించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్ట్తో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇవాళ శంకుస్థాపన జరగనుండగా.. షిప్ యార్డ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, మేడిన్ ఏపీ బ్రాండ్తో ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.