Delimitation Bill: ఏపీలో 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే, 2029 సాధారణ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 263కు, లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. 2023లో ఆమోదం పొందిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ (మహిళా రిజర్వేషన్ చట్టం)ను 2029 ఎన్నికల నాటికి అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ సంస్కరణలను చేపట్టింది. ఈ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే, నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఏపీలో 33 శాతం మహిళా రిజర్వేషన్ల ప్రకారం పెరిగిన అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 87, లోక్సభ స్థానాల్లో 13 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. సీట్ల పెంపునకు అనుగుణంగా జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల సంఖ్య కూడా పెరగనుంది.