Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు.
- By Pasha Published Date - 09:05 PM, Tue - 12 November 24

Group 2 Mains : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. 2025 జనవరి 5న జరగాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సిలబస్లో మార్పులు జరిగినందున పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు ఇంకొంత సమయం ఇవ్వాలని ఏపీపీఎస్సీని ఇటీవలే పలువురు అభ్యర్థులు కోరారు.
Also Read :Army Helpline : సైనికులు, మాజీ సైనికుల కోసం.. ఆర్మీ హెల్ప్ లైన్ 155306
ఈ కారణం వల్లే పరీక్ష తేదీని మార్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల్లో కొంతమంది డీఎస్సీ ఎగ్జామ్కు కూడా హాజరవుతారు. అలాంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తొలుత గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్కు జనవరి 5వ తేదీని ఫిక్స్ చేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో జనవరి 5న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించాలని భావించారు. అయితే గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి పరీక్ష రాసేందుకు కనీసం మూడు నెలల టైం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ రిక్వెస్టును టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా పరిగణించింది. అభ్యర్థుల ప్రయోజనార్ధం పరీక్ష తేదీని ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.
Also Read :Train Owner : ఎక్స్ప్రెస్ రైలుకు ఓనర్ అయిన రైతు.. ఎలా అంటే ?
ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్టులు.. న్యూ అప్డేట్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు ఏపీపీఎస్సీ రెడీ అయింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తులను సమర్పించేందుకు అభ్యర్థులకు డిసెంబర్ 3 వరకు అవకాశాన్ని కల్పించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఈ పరీక్షలకు అప్లై చేసుకోనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితే వారి కెరీర్ జర్నీలో ప్లస్ పాయింటుగా మారుతుంది.