Ap Cabinet : మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు ఆమోదం
రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది.
- Author : Latha Suma
Date : 02-01-2025 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
Ap Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్లైంది. రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా ఆమోదముద్ర వేసింది.
ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు, ఎస్ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతోందని సమాచారం. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానందర్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.