HMPV Virus in India : ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్
HMPV Virus in India : మనదేశంలోనూ కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో HMPV కేసులు నమోదు కావటం ప్రజలలో భయాందోళనలను కలిగిస్తోంది
- By Sudheer Published Date - 09:48 PM, Mon - 6 January 25

దేశంలో హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, జపాన్ వంటి దేశాలలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో, ఇప్పుడు మనదేశంలోనూ కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో HMPV కేసులు నమోదు కావటం ప్రజలలో భయాందోళనలను కలిగిస్తోంది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ (Andhra Pradesh Health Department) అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) అధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏపీలో కేసులు లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండేందుకు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. టెస్టులు, ఔషధాలు అందుబాటులో ఉండేలా చేయాలని స్పష్టం చేశారు.
Bangladesh : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ రెండో అరెస్టు వారెంట్ జారీ
హెచ్ఎంపీవీ ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులు, మరియు తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇది సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లాంటిదే అయినప్పటికీ, కొన్నిసార్లు తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా సాధారణ చికిత్సతోనే తగ్గిపోతుంది, కానీ కొన్నిసార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన అవసరం ఉండొచ్చు.
2001లో గుర్తించిన ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో 12 శాతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమని వైద్యులు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఈ వైరస్ను సీరియస్గా తీసుకొని ప్రజల ఆరోగ్యం కోసం తగు చర్యలు చేపడుతోంది. అన్ని రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సూచనలు పంపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులతో దూరంగా ఉండడం, మరియు అనుమానిత లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వీటి ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.