Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
- Author : Sudheer
Date : 26-03-2026 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి అదనపు భారం పడకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) కి ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ట్రూ అప్ చార్జీల భారం సామాన్యుడిపై పడకుండా చూస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, అటు గృహ వినియోగదారులకు, ఇటు వాణిజ్య వర్గాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈ నిర్ణయంతో పాటు వివిధ రంగాలను ప్రోత్సహించేలా ఈఆర్సీ టారిఫ్ నిర్మాణంలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను పెంచే లక్ష్యంతో సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమలకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. అలాగే, చిన్న తరహా పరిశ్రమలకు మద్దతుగా వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లను వాణిజ్య విభాగం నుండి పారిశ్రామిక విభాగానికి మార్చారు. దీనివల్ల ఆయా యూనిట్లకు విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. జాతీయ రహదారులపై వీధి దీపాల కేటగిరీని కూడా మార్చడం ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గనుంది.
విద్యుత్ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం మరియు ఈఆర్సీ కఠిన ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు డిస్కమ్లు మరియు ట్రాన్స్కో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించాయి. సామాన్య ప్రజలు సైతం తమ ప్రాంతాల్లోని ప్రమాదకర విద్యుత్ తీగలు లేదా స్తంభాల ఫోటోలను నేరుగా వెబ్సైట్లలో అప్లోడ్ చేసేలా ఫిర్యాదుల వ్యవస్థను ఆధునీకరించాలని ఆదేశించింది. మొత్తం మీద, గత 21 నెలల్లో దాదాపు రూ. 20,288.46 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించడం ద్వారా విద్యుత్ రంగంలో వినియోగదారులకు నిరంతర ఉపశమనాన్ని కలిగిస్తోంది.