Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్లు
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
- Author : Kavya Krishna
Date : 29-07-2025 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
Good News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ (Spouse) పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 1,09,155 మందికి నెలకు రూ.4,000 చొప్పున పింఛన్లు ఆగస్టు 1 నుంచి అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పింఛన్ తీసుకుంటూ భర్త మరణించిన సందర్భంలో, భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద వెంటనే పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.43.66 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది.
Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!
2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య భర్తలు మరణించిన కుటుంబాల మహిళలు, అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడీ, మరణ ధ్రువపత్రం సమర్పించిన అర్హులను జాబితాలో చేర్చారు. మొదటగా ఈ పింఛన్లు జూన్ 12న (ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా) ఇవ్వాలని భావించారు. కానీ వాయిదా పడటంతో, ఆగస్టు 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఇక మరోవైపు, దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం సమగ్ర తనిఖీలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అనర్హులు లక్ష మందికి పైగా పింఛన్లు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. కొందరు నెలకు రూ.6 వేల వరకు పింఛన్ పొందుతున్నప్పటికీ, వాస్తవానికి వైకల్యం లేని వారు తప్పుడు ధ్రువపత్రాలు తీసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి.
మానసిక సమస్యలు, వినికిడి లోపం వంటి నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి పింఛన్ పొందిన వారిని గుర్తించేందుకు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో కూడా అనర్హుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో దివ్యాంగుల కోటాలో రూ.6 వేల, రూ.10 వేల, రూ.15 వేల వరకు పింఛన్లు పొందిన వారిలో అనర్హులు ఉన్నట్లు తేలింది. త్వరలో ఈ జాబితాపై అధికారిక క్లారిటీ ఇచ్చి, అనర్హుల పింఛన్లు రద్దు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తూనే, అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.