CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు
- Author : Prasad
Date : 01-06-2026 - 1:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గంలో పర్యటించారు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజని, విధ్వంసక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. అందుకు నిదర్శనమే పెన్షన్ల పెంపు అని తెలిపారు. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు, బకాయిలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే పెన్షన్లను పెంచి అందిస్తున్నామని చెప్పారు. సాధారణ పెన్షన్లను రూ.4 వేలకూ, దివ్యాంగుల పెన్షన్లను రూ.6 వేలకూ, ప్రత్యేక ఆరోగ్య పెన్షన్లను రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచినట్లు వెల్లడించారు.
2024 జూలై నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో రూ.65,887 కోట్లను లబ్ధిదారులకు అందించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 23 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు.
కాకినాడ సమీపంలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని, “సంజీవని” పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించి ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. అలాగే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డాక్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు “స్వర్ణాంధ్ర 2047” విజన్ రూపొందించామని చంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రానికి సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.