AP Credit : 2024 నాటి 10 లక్షల కోట్ల అప్పుతో ఏపీ?
ఏపీ అప్పులను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవలం ఏపీ మాత్రమే అవుతుందా? దేశంలోని ఇతర రాష్ట్రాలకు శ్రీలంక తరహా సంక్షోభం రాకుండా ఏపీని మాత్రమే తాకుతుందా
- By CS Rao Published Date - 12:26 PM, Sat - 23 July 22
ఏపీ అప్పులను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవలం ఏపీ మాత్రమే అవుతుందా? దేశంలోని ఇతర రాష్ట్రాలకు శ్రీలంక తరహా సంక్షోభం రాకుండా ఏపీని మాత్రమే తాకుతుందా? అంటే కొన్ని నిజాలు మరికొన్ని అబద్దాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత సుమారు 1.75 లక్షల కోట్లు అప్పు వాటాగా వచ్చింది. 2014 లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మరో 1.50లక్షల కోట్లు అప్పు చేశారు. వెరసి సుమారు 3.25 లక్షల కోట్ల అప్పుతో ఉన్న రాష్ట్రానికి 2019 మే నెలలో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఏపీ అప్పులు మొత్తం రూ.8 లక్షల కోట్లకు చేరాయని ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం చూపుతున్న లెక్కలకు కేంద్రం పేర్కొన్న లెక్కలకు పొంతనే కుదరడంలేదు. ఆ విషయాన్ని కాగ్ పలుమార్లు చెప్పింది. ఏటా రాష్ట్ర జీఎస్డీపీలో అప్పులు 4%కు మించకూడదని ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ లెక్కకు మించి అప్పులు చేస్తోందని అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇప్పటికే హెచ్చరించింది.
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ అప్పు రమారమి రూ.4.25 లక్షల కోట్లుగా పేర్కొన్నట్లు కొందరు చెబుతున్నారు. కానీ వాస్తవ లెక్కలు ఇంతకంటే చాలా ఎక్కువని అంటున్నారు. జగన్ ప్రభుత్వం బడ్జెట్లో చూపకుండా ఈ మూడేళ్లలో చేసిన అప్పు రూ.28,837 కోట్లు అని కేంద్రం తన ప్రజంటేషన్లో పేర్కొంది. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా కేంద్రం ఈ లెక్కలను చూపిందని అంటున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం అప్పు రూ.4,39,394 కోట్లకు చేరుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం చివరికే రాష్ట్రం అప్పు ఎంతో భారంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బహిరంగ రుణాలు రూ.4,13,000 కోట్లు రాష్ట్ర కార్పొరేషన్ల అప్పు రూ.1,38,603 కోట్లు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ అప్పులు రూ.10 వేల కోట్లు నాన్ గ్యారెంటీ రుణాలు రూ.77,233 కోట్లు ఉన్నాయంటున్నారు. గత మూడేళ్లలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1.50 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. ఈ మొత్తం కలిపితే 7,88,836 కోట్లు అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం బడ్జెటేతర రుణాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నట్లు తేల్చింది. జీఎస్డీపీలో బడ్జెట్లో చూపని రుణాలు సుమారు 2.5% ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి రుణాల మొత్తం రాష్ట్ర స్థూల తలసరి ఆదాయం (జీఎస్డీపీ)లో 4% దాటకూడదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెటేతర రుణాలు అంతకుమించి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా దాదాపు రూ.23,000 కోట్ల రుణం ఈ మూడేళ్లలోనే జగన్ ప్రభుత్వం తీసుకుంది. ఇవికాకుండా గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రూ.70 వేల కోట్ల వరకు ఉన్నాయని అంచనా. ఇలా బడ్జెట్లో చూపని రుణాలు రూ.లక్ష కోట్ల పైమాటేనన్నది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో చూపకుండా రుణం పొంది తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఏటా వడ్డీలు అసలు రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.15 వేల కోట్లు ఉంటుంది. దీనికి ఇంకా నాన్ గ్యారంటీ రుణాలు కలపాల్సి ఉందని చెబుతున్నారు.
మద్యం డిపోల ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్క్రో చేసి ఏపీఎస్డీసీ ద్వారా దాదాపు రూ.23 వేల కోట్ల రుణం తీసుకుందని తెలుస్తోంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ అప్పుగా చూపించడం లేదట. తాజాగా బెవరేజస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.83,00 కోట్ల రుణం తీసుకుందని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ మరో రెండేలు పాలన చేస్తే 10 లక్షల కోట్ల వరకు అప్పు మోతాదు తేలుతుందని ఆర్థిక వేత్తల అంచనా. అయితే, కొన్ని రాష్ట్రాల కంటే ఏపీ మెరుగ్గా ఉందని కేంద్రం చెబుతోంది.
Related News
AP EAMCET 2024 Exam: ఏపీలో రేపటి నుంచి EAPCET 2024 పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ( EAPCET ) పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి.